యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడినే కమ్మ మంత్రిని.. నాపై కుట్రలు.. పువ్వాడ

తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజికవర్గం నుంచి ఒక్కడినే మంత్రిగా మిగిలానని పువ్వాడ అన్నారు. తనపై కొందరు కావాలని కుట్రలు చేస్తున్నారని.. అందరం ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

Samayam Telugu 22 Apr 2022, 5:05 pm
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసుతో వివాదంలో ఇరుక్కున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వైరాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజికవర్గం నుంచి తానొక్కడినే మంత్రిగా మిగిలానని ఆయన అన్నారు. మనందరం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మంలో చిన్న సంఘటన జరిగితే కొందరు కుటిల రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Samayam Telugu Puvvada


కొందరు సూడో చౌదర్లు కుటిల రాజకీయ నేతలతో కలిసి తనపై రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మ జాతి సభ్యులందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. తనపై కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించి బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేశారని.. అదే తరహాలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలను న్యాయం చేస్తున్నారని పువ్వాడ అన్నారు.

ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న మంత్రి పువ్వాడ కమ్మ సంఘం సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావుతో మంత్రి పువ్వాడకు విభేదాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. నేతల నడుమ ఆధిపత్య పోరు నడుస్తోందన్న వాదనలున్నాయి. తుమ్మల అనుచరులపై అక్రమ కేసులు పెట్టించి జైలుకి పంపించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో అందరం ఐకమత్యంగా ఉండాలని మంత్రి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.