యాప్నగరం

భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు.. ఈనెల 16 నుంచి ప్రారభం

Bhadradri Temple: భద్రాద్రి రామాలయంలో ఈనెల 16 నుంచి నూతన ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. సేవలకు సంబంధించిన వివరాలను ఆలయ ఈవో వెల్లడించారు. అయితే గతంలోని పూజా కార్యాక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 10 Apr 2023, 10:21 am

ప్రధానాంశాలు:

  • భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు
  • ఈనెల 16 నుంచి అనుమతి
  • గతంలోని పూజా కార్యక్రమాలు యథాతథం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bhadradri
భద్రాద్రిలో నూతన సేవలు
Bhadradri Temple: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నూతన ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 16 నుంచి నూతన పూజలు, సేవలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి స్పష్టంచేశారు. ఈ ఏడాది జనవరి నుంచే నూతన ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జాప్యం జరిగింది. అయితే.. గతంలోని పూజా సేవలన్నీ యథాతథంగా ఉంటాయని ఆలయ ఈవో వెల్లడించగా.. నూతన సేవల వివరాలు ఇలా ఉన్నాయి.
వేదాశీర్వచనం
స్వామివారి దర్శనానంతరం బేడా మండపంలో ఒక్కొక్కరికి లేదా దంపతులు నిర్వహిస్తారు. రూ.500 టికెట్‌తో ఉదయం 9.30, 10, 10.30, 11 గంటల స్లాట్స్‌లలో ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందజేస్తారు. ఇందులో పాల్గొన్న భక్తులకు కండువాతో పాటు, జాకెట్‌ పీసు, 100 గ్రామల లడ్డూను అందజేస్తారు.

స్వామివారికి తులసీమాల అలంకరణ
ఈ సేవ ప్రతి శనివారం ఉదయం 7గంటలకు మాత్రమే ఉంటుంది. రూ.1,000 టికెట్‌తో దంపతులు లేదా ఒకరికి ఉభయదాత శిరస్సుపై తులసీమాల ఉంచి ఆలయ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తర్వాత అంతరాలయంలో వారి సమక్షంలో దృవమూర్తులకు అలంకరణ చేస్తారు. ఈ సేవలో పాల్గొన్న వారికి కండువాతో పాటు జాకెట్‌ పీసు, 100 గ్రాముల రెండు లడ్డూలు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకాన్ని అందజేస్తారు.

స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ
దీన్ని ఉదయాస్తమాన సేవ అని పిలుస్తారు. ప్రతి రోజు ఉంటుంది. రూ.5 వేల టికెట్‌తో ప్రతి రోజూ జరిగే అన్ని సేవలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం మాత్రం 10 టికెట్లకే అవకాశం ఉంటుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు సుప్రభాతం, అభిషేకం, అంతరాలయ అర్చన, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయస్వామి వారి అర్చన, నిత్య కల్యాణం, వేదాశీర్వచనం, సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, అదనంగా ఐదుగురికి అన్నప్రసాదం కల్పిస్తారు. దర్బారు సేవ, రాత్రి పవళింపు (ఏకాంత సేవకూ వీరిని అనుమతిస్తారు.

శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల సమర్పణ
రూ.10 వేల టికెట్‌తో శ్రీరామనవమి కల్యాణ టికెట్‌ సెక్టార్‌ – 2లో రెండు సంవత్సరాలకు టికెట్లు, కల్యాణ వ్రస్తాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు ఈ సేవలో పాల్గొనే భక్తులకు అందజేయనున్నారు.

నిత్య పూల అలంకరణ సేవ
సోమవారం నుంచి శనివారం వరకు జరిగే పూజల్లో స్వామి వారికి, ఉపాలయాల్లో అవసరమైన పూల దండల సమర్పణ. ఈ సేవ టికెట్ ధర రూ. 5 వేలుగా నిర్ణయించారు. ఇందులో పాల్గొనే వారికి కండువా, జాకెట్‌ పీసు, రెండు చిన్న లడ్డూలు, నలుగురికి అన్నప్రసాదం కల్పించనున్నారు.

తులాభారం
ప్రతి రోజూ తులాభారం (భక్తులు మొక్కుకున్న చిల్లర నాణేలు, బియ్యం లేదా తదితర వస్తువులు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందించవచ్చు. రుసుము రూ.100.

Read More Latest Andhra Pradesh News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.