యాప్నగరం

సీబీఐ విచారణకు సిద్ధమా? అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్

Pinapaka MLA: అటవీశాఖాధికారులపై సోషల్ మీడియా ద్వారా నాలుగు రోజుల క్రితం కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారుల వల్లే అడవులు అంతరించిపోయాయని ఆయన ఆరోపించారు.

Samayam Telugu 17 Dec 2020, 4:09 pm
ప్రభుత్వ విప్, అధికార పార్టీ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖ అధికారులపై సోషల్ మీడియాలో ఆయన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటవీశాఖ అధికారులు నిజాయతీ పరులైతే సీబీఐ విచారణకు సిద్దమా అని రేగా కాంతారావు ప్రశ్నించారు. రైతుల భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యులు కారా.. మీ వద్ద ఎవరు ఇచ్చిన పట్టాలు చెల్లుతాయి? అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఫారెస్ట్ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన తప్పేమైనా ఉంటే కేసులు పెట్టుకోవాలని సవాలు విసిరారు.
Samayam Telugu రేగా కాంతారావు
rega kantha rao


అటవీశాఖాధికారులపై సోషల్ మీడియా ద్వారా నాలుగు రోజుల క్రితం కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారుల వల్లే అడవులు అంతరించిపోయాయని ఆయన ఆరోపించారు. దమ్ముంటే జాయింట్ సర్వే చేయిద్దామని.. రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వ భూములు మీ కబ్జాలో ఉంటే శిక్షకు సిద్ధమా అని ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే అటవీశాఖాధికారులను నిర్భంధించాలని రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కోరారు. పోడు భూముల విషయంలో అటవీశాఖాధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. ఈ భూముల విషయాన్ని పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

వివాదం ఏంటంటే..
పోడు భూములను సాగుచేసుకోవడం ఆదివాసీల జీవనశైలి. అడవి నరికి సాగుచేసుకుని బతుకుతుండడం వారి హక్కు. వారు పుట్టి పెరిగిన అటవీ ప్రాంతం వారి సొంతం. మూలవాసులైన వారి హక్కులకు ఎవరూ భంగం కలిగించరాదు. అది వ్యక్తి అయినా ప్రభుత్వం అయినా.. చివరకు చట్టం రూపంలోనూ వారి ప్రశాంత జీవనానికి భంగం కలిగించకూడదు. అయితే క్రమంగా తరిగిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవడానికి నిత్యం శ్రమిస్తున్న అటవీ శాఖ తమ ధర్మాన్ని తాము నిర్వర్తించాలన్న దిశగా పని చేస్తోంది.

అయితే పోడు పేరిట, ఆదివాసీల హక్కుల పేరిట పర్యావరణాన్ని ఫణంగా పెట్టలేమన్నది అటవీ శాఖ చెబుతోంది. పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలలో ఈ పోడు రగడ గత కొన్ని సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. అడవిని నరుకుతున్నారని అటవీశాఖ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఈ ప్రాంతంలో జరుగుతుంటుంది. దీనికి తోడు రెవెన్యూ భూములకు, అటవీ భూములకు మధ్య సరిహద్దు వివాదాలు ఏళ్ల తరబడి సాగుతున్న దుస్థితి కూడా ఉంది. దీంతో ఆదివాసీలు సాగు చేసి పైరు వేయడం, అటవీశాఖ అధికారులు పాడుచేయడం నిత్యకృత్యంగా మారింది. ఇది క్రమేణా ఆదివాసీలకు, అటవీశాఖకు పూడ్చలేని అగాధాన్ని పెంచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.