యాప్నగరం

‘టీఆర్‌ఎస్’ ఎమ్మెల్యేకి షాక్.. ఏ2గా కొడుకు.. సూసైడ్ కేసులో సంచలనం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి షాక్ తగిలింది. వ్యాపారి ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు రాఘవేందర్‌పై పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Samayam Telugu 5 Aug 2021, 4:15 pm
పాల్వంచ‌కి చెందిన ఫైనాన్స్ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు ఆత్మహత్య జిల్లాలో కలకలం రేపుతోంది. గత నెల 29న వెంకటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ అలజడి రేపింది. తన చావుకి వీళ్లే కారణమంటూ సుమారు 45 మంది పేర్లు రాసి బలవన్మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. అందులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌ పేరును ప్రధానంగా రాయడంతో చర్చనీయాంశమైంది.
Samayam Telugu ఎమ్మెల్యే వనమా, ఆయన కుమారుడు రాఘవేంద్ర
vanama


తమ బంధువుల వద్ద చిట్టీలు వేసి పాడుకుంటే డబ్బులివ్వకుండా ఓ స్థలం అగ్రిమెంట్ చేశారని.. అదే స్థలాన్ని మరొకరికి విక్రయించారని మృతుడి భార్య ఆరోపిస్తోంది. అదేంటని ప్రశ్నించిన తన భర్తని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఎమ్మెల్యే కొడుకు రాఘవేందర్ డబ్బులు తీసుకుని వారికి సహకరించారని ఆమె ఆరోపించారు. ఆ స్థలంలో వేసుకున్న రేకుల షెడ్డును కూడా కూల్చివేశారని వాపోయారు. అన్యాయమని ప్రశ్నించినందుకు తన భర్తను కొట్టి.. మానసికంగా హింసించారని.. అవమానభారంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూసైడ్ నోట్‌ ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ2గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు కావడం జిల్లాలో చర్చనీయాంశం మారింది. జిల్లా ఎస్పీ సునీల్ దత్, మణుగూరు ఏఎస్పీ శబరీష్ కేసు విచారణను పర్యవేక్షిస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.