యాప్నగరం

KCR: పంట నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎకరానికి ఎంతంటే..

KCR:ఖమ్మం జిల్లా రావినూతలలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతులు నిరాశకు గురికావొద్దని.., పంట నష్టపోయిన అన్నదాతకు ఎకరానికి రూ. 10 వేలు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 23 Mar 2023, 4:21 pm

ప్రధానాంశాలు:

  • అన్నదాతకు అండగా ఉంటాం
  • నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం
  • ప్రకటించిన సీఎం కేసీఆర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr
తెలంగాణ సీఎం కేసీఆర్
Telangana Rains: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు, వడగళ్ల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులు అధైర్య పడొద్దని వారిని కూడా తమ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు. కేంద్రానికి నివేదిక పంపించబోమని అన్నారు. గతంలో చాలా సార్లు నివేదికలు పంపామని కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో పర్యటించిన సీఎం కేసీఆర్.. వర్షం వల్ల నష్టం జరిగిన పంటలను పరిశీలించారు. గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు ? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
"అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు నిరాశకు గురి కావొద్దు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే. సమస్యలు ఉన్నాయని చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వదు. వ్యవసాయం దండగ అనే మూర్ఖులు ఉన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తాం. కౌలు రైతులను కూడా ప్రభుత్వమే ఆదుకుంటుంది. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోంది. దేశంలో రైతులకు లాభం చేకూర్చే పాలసీలు లేవు. మెుత్తం వ్యవసాయ పాలసీలను బీఆర్ఎస్ ఇస్తుంది." అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యనించారు.

అంతకు ముందు సీఎం.. ఏరియల్ వ్యూ ద్వారా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం సీఎం మహబూబాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకొని పరిసర గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.
Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.