యాప్నగరం

ఖమ్మంలో విషాదం.. కలుపు మందు తాగి యువకుడి ఆత్మహత్య

ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రాకపోవడంతో గత కొన్నిరోజులుగా నాగేశ్వర్రావు మనస్తాపంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు రాత్రయినా తిరిగి రాలేదు.

Samayam Telugu 15 Jul 2021, 7:29 am
తెలంగాణలో యువకులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగంతో, ఉపాధి దొరక్క, ఉద్యోగ నోటిఫికేషన్లు రాక మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉద్యోగ ప్రకటనలు వెలువడక పోవడంతో ఒత్తిడికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు(29) 2015లో ఎం.ఎ. ఎకనామిక్స్‌ పూర్తి చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రెండేళ్లపాటు హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపం చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉన్న కలుపు మందును బయటికి తీసుకెళ్లి తాగాడని పేర్కొన్నారు. అయితే రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు అతని కోసం వెతికారు.

ఊరిబయట ఉన్న జామాయిల్‌ చెట్లలో నాగేశ్వరరావు పడిపోయి ఉండటంతో వెంటనే పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని నాగేశ్వర్రావు కుటుంబసభ్యులు తెలిపారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడకపోవడంతో ఒత్తిడికి గురై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నాగేశ్వర్రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.