యాప్నగరం

రాష్ట్రానికి కేసీఆర్ దరిద్రంగా మారారు.. రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలర్: వైఎస్ షర్మిల

రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్.. దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పంజాబ్‌లో రైతులకు సీఎం కేసీఆర్‌ పరిహారం ఇస్తున్నారని విమర్శించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 29 May 2022, 8:35 am
తెలంగాణకు సీఎం కేసీఆర్‌ దరిద్రంగా మారారని వైఎస్సార్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఆయన దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పంజాబ్‌లో రైతులకు సీఎం కేసీఆర్‌ పరిహారం ఇస్తున్నారని విమర్శించారు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామం నుంచి శనివారం ఆమె తన ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు.
Samayam Telugu YS Sharmila Khammam


ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ద్రోహం చేస్తున్నాయని వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ మోసం చేయని వర్గమంటూ లేదని, ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను దగా చేశారని ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడని నమ్మి కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని దోచుకొని రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.

కేసీఆర్‌ అవినీతి చిట్టా తమవద్ద ఉందని చెబుతున్న కేంద్రం ఆయనపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ముస్లిం, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బండి సంజయ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ రిజర్వేషన్లను రద్దు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ వల్ల కూడా కాదన్నారు. ఇటీవల బండి సంజయ్‌ ముస్లిం, మైనారిటీ రిజర్వేషన్లు, మసీదులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోగా ప్రధాని మోదీ కూడా సమర్థించడం దారుణమని మండిపడ్డారు. మసీదులను కూల్చి శవాలుంటే ముస్లింలవని, శివలింగాలు ఉంటే హిందువులని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

రెడ్డి సామాజిక వర్గానికి అధికారం ఉండాలంటూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. ఓటుకు నోటు కేసు దొంగ. రెడ్డి సమాజానికే అధికారం ఇవ్వాలట. ఇతర కులాలు నాయకత్వానికి పనికిరారట. ప్రజలకు కావాల్సింది కులం కాదు గుణం. రాష్ట్ర అధ్యక్షుడే కుల రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానానికి కనిపించడం లేదా?’ అని ఆమె నిలదీశారు. షర్మిల పాదయాత్ర 78వరోజు ఆదివారం సిద్దారం వద్దే ప్రారంభం అవుతుంది. మర్లపాడులో రాత్రి బస చేయనున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.