యాప్నగరం

నన్ను చదివించండి సార్.. మంత్రి చేయి పట్టుకొని ఏడ్చిన బాలుడు.. చలించిన శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud | మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంచి మనసు చాటుకున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో చదువు మానేసి కూల్ డ్రింక్స్ విక్రయిస్తోన్న బాలుణ్ని మళ్లీ బడిలో చేర్పించారు. సార్.. నన్ను చదివించండంటూ ఆ పిల్లాడు ఏడవటంతో.. మంత్రి చలించిపోయారు. తన వెంట కార్లో తీసుకొని వెళ్లి మహబూబ్‌నగర్‌లోని పేరొందిన పాఠశాలలో చేర్పించారు. పిల్లాడి బాధ్యత తనదని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. అతడికి అన్ని సదుపాయాలు కల్పించాలని తన సిబ్బందిని ఆదేశించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 27 Jun 2022, 5:09 pm

ప్రధానాంశాలు:

  • మంచి మనసు చాటుకున్న మంత్రి
  • తనను చదివించాలని మంత్రిని వేడుకున్న బాలుడు
  • తనతో తీసుకెళ్లి ప్రయివేట్ స్కూల్లో చేర్పించిన శ్రీనివాస్ గౌడ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Srinivas Goud
Minister Srinivas Goud
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంచి మనసు చాటుకున్నారు. చదువు మానేసి కూల్ డ్రింక్స్ విక్రయిస్తోన్న బాలుడిని మళ్లీ బడిలో చేర్పించారు. సార్ నాకు చదవుకోవాలని ఉందంటూ.. ఆ పిల్లాడు చేయి పట్టుకొని అడగ్గానే ఆయన చలించిపోయారు. ఆ బాలుడి బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వెంటనే తనతోపాటు కార్లో తీసుకెళ్లి బడిలో చేర్పించారు. పిల్లాడికి అన్ని సౌకర్యాలు కల్పించాలని.. తన కొడుకులా చూసుకోవాలని ఆదేశించారు. పిల్లాడు గొప్పవాడు అవుతాడని.. రేపు గవర్నమెంట్ కారులో తిరుగుతాడని.. అతడి తల్లిదండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
మహబూబ్ నగర్ జిల్లా కాకర్లపాడు గ్రామానికి చెందిన మల్లెల వెంకటేష్, బుజ్జమ్మ దంపతుల కుమారుడు విజయ కుమార్.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బడికి వెళ్లడం మానేశాడు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్టణంలోని మైసమ్మ గుడి వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం మైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కూల్ డ్రింక్ విక్రయిస్తున్న బాలుడు విజయ్ కుమార్.. మంత్రిని చూసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి.. చేయిపట్టుకుని నన్ను చదివించండి సర్ అంటూ ఏడ్చేశాడు. చదువు పట్ల ఆ పిల్లాడి తపన మంత్రిని కదిలించింది.
వెంటనే బాలుడిని దగ్గరకు తీసుకున్న మంత్రి.. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. అనంతరం బాలుణ్ని తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. పట్టణంలో మంచి పేరున్న రిషి విద్యాలయానికి ఫోన్ చేసి బాలుడిని ఆరో తరగతిలో చేర్చుకుని హాస్టల్ వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఖర్చు ఎంతైనా సరే తాను భరిస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బాలుడికి అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులు కొనివ్వండని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.

బాలుడిని జీవితంలో స్థిరపడేలా చేస్తానని.. అంత వరకు అతడి బాధ్యతను తానే తీసుకుంటానని మంత్రి తెలిపారు. తన సొంత కుమారుడిలా చదువు చెప్పిస్తానన్నారు. అంతే కాదు.. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. బాలుడు తన వద్దకు వచ్చి అడిగిన విధానం, చదువు పట్ల అతడికి ఉన్న శ్రద్ధ తనను కదిలించింద‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి చేసిన మంచి పనికి మహబూబ్‌నగర్ వాసులు ఫిదా అయ్యారు. మా మంత్రి మంచోడంటూ.. శ్రీనివాస్ గౌడ్‌పై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.