యాప్నగరం

కలెక్టర్‌నే మోసం చేసిన సెక్యూరిటీ గార్డు.. నమ్మి ఏటీఎం కార్డు ఇస్తే..

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయమని కార్డు ఇస్తే కలెక్టర్‌నే మోసం చేశాడో సెక్యూరిటీ గార్డు. కలెక్టర్‌కి తెలియకుండా పలు విడతలుగా రూ.40వేలు డ్రా చేసేశాడు.

Samayam Telugu 28 Oct 2021, 9:57 am
ఓ సీనియర్ అధికారి తన వద్ద నమ్మకంగా పనిచేసే సెక్యూరిటీ గార్డుకు ఏటీఎం పిన్‌ నంబరు చెబితే దాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు డ్రా చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా అడిషనల్ కలెక్టర్‌ రఘురాంశర్మ ఇంట్లో గద్వాలకు చెందిన రాజు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధుల్లో బిజీగా ఉండటంతో రఘురాంశర్మ చాలా సందర్భాల్లో తనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు రాజుకు ఏటీఎం కార్డు ఇచ్చి, పిన్ నంబర్ చెప్పి మనీ విత్‌డ్రా చేయమనేవారు. ఎంతో నమ్మకంగా ఉండే రాజు అదనపు కలెక్టర్‌ చెప్పినప్పుడల్లా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చేవాడు.
Samayam Telugu Image


అయితే డబ్బు మీద ఆశతో రాజు బుద్ధి వక్రమార్గం పట్టింది. రఘురాంశర్మ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆయన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలని పథకం పన్నాడు. స్థానికంగా డబ్బులు విత్‌డ్రా చేస్తే దొరుకుతానని అనుకున్నాడేమో అప్పుడప్పుడూ వనపర్తికి వెళ్లి విడతల వారీగా రూ.40 వేలు డ్రా చేశాడు. తిరిగి ఏమీ తెలియనట్టు ఆయన ఇంటి వద్దే విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఏటీఎం కార్డు నుంచి రూ.40 వేల డబ్బులు విత్‌డ్రా చేసిన సెల్‌ఫోన్2కు మెసేజ్‌లు రావడంతో కంగుతిన్న అదనపు కలెక్టర్‌ రఘురాంశర్మ గద్వాల టైన్ పోలీసులకు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.

తన ఏటీఎం కార్డు పిన్ నంబర్ రాజుకు తెలుసని ఆయన ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే రూ.40వేలు డ్రా చేసింది తానేనని రాజు అంగీకిరంచాడు. అదనపు కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు గద్వాల టౌన్ ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.