యాప్నగరం

పక్కింటావిడతో భర్త పరార్.. మనస్తాపంతో మహిళా సర్పంచి ఆత్మహత్య

ఓ వివాహితను తీసుకుపోయిన భర్త ఆమెను రెండో పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన గ్రామ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది.

Samayam Telugu 26 Sep 2021, 11:09 am
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. భర్త రెండో వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె నసురుల్లాబాద్‌ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నారు. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు.. జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, మాచారం తండాకు చెందిన పాల్‌త్యావత్‌ సిరి (30)కి పన్నెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Samayam Telugu సిరి(ఫైల్ ఫోటో)


రెండేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన నసురుల్లాబాద్‌ తండా నుంచి 2019 జనవరి ఎన్నికల్లో సిరి ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నికయ్యారు. కొద్ది నెలల కిందట శ్రీనివాస్‌ నాయక్‌ అదే తండాకు చెందిన ఓ వివాహితతో వెళ్లిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 14న ఆ మహిళతో కలిసి స్వగ్రామానికి రాగా సిరి గొడవ పడ్డారు. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన సిరి మనస్తాపంతో పరుగుల మందు తాగి ఆత్మహత్య యత్నించింది.

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిరి శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె సోదరుడు శంకర్‌ నాయక్‌ ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త శ్రీనివాస్‌ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.