యాప్నగరం

యాదాద్రికి ‘పసిడి’ కాంతులు.. 36కిలోల బంగారం విరాళమిచ్చిన దాతలు

సుందరంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి ఆలయానికి దాతలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. విమాన గోపురం స్వర్ణ తాపడానికి ఇప్పటివరకు ఏకంగా 36 కిలోల బంగారం విరాళం వచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

Samayam Telugu 22 Oct 2021, 11:28 am

ప్రధానాంశాలు:

  • యాదాద్రికి ‘పసిడి’ కాంతులు
  • విమాన గోపురానికి సమకూరిన 36 కిలోల పసిడి
  • కిలో చొప్పున ప్రకటించిన ఎమ్మెల్యే దానం, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు లక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం దాతలు కిలోల కొద్దీ బంగారం విరాళాలుగా ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కార్పోరేట్ సంస్థలు కిలోల కొద్దీ బంగారాన్ని ఇవ్వగా... గురువారం ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కిలో చొప్పున బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తమ కుటుంబం, శ్రీని ఫార్మా గ్రూపు సంస్థ తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చిన్నపరెడ్డి తెలిపారు. కేసీఆర్‌ పిలుపు మేరకు యాదాద్రి నరసింహుడిపై భక్తితో బంగారం అందజేస్తున్నట్లు దానం పేర్కొన్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులు మూడు కిలోల బంగారం ఇస్తున్నట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ ప్రకటించారు. తనతో పాటు నీలామంగై, సౌమ్యలత, హర్షిత, లక్ష్మీనారాయణ, జయతులసి చంద్రశేఖర్‌ తదితర దాతలు బంగారం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. యాదాద్రి ఆలయానికి ఇప్పటివరకు దాతలు 36.16 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.