యాప్నగరం

CM KCR: దేశం కీర్తిని పెంచే విధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం

CM KCR: నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్లాంట్‌ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. ముందు ఎరియల్ వ్యూ ద్వారా ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం.. అధికారులతో కలిసి ప్లాంట్‌ వద్దకు వెళ్లి పర్యవేక్షించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 28 Nov 2022, 10:47 pm
CM KCR: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్‌ ప్లాంట్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్ ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రెండు హెలికాప్టర్లలో హైదరాబాద్‌ నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాంట్‌ వద్దకు వెళ్లారు సీఎం కేసీఆర్. తొలుత ప్లాంట్‌ ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లిన సీఎం... 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌ చేరుకొని నిర్మాణ పనులు పరిశీలించారు. ప్లాంట్‌నిర్మాణం జరుగుతున్న తీరును ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్‌ ప్లాంట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరమనే విషయంపై సీఎం ఆరాతీశారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Samayam Telugu cm kcr inspects yadadri mega thermal power plant project
CM KCR: దేశం కీర్తిని పెంచే విధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం


​ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి..

ప్లాంట్‌లో కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్‌ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర నిర్వహణలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్‌ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నీటి సరఫరాకు కృష్ణా నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

​100 ఎకరాలు సేకరించండి..


విద్యుత్‌ కేంద్రంలో పనిచేసే సుమారు 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మాణం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అక్కడే భవిష్యత్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ చేపట్టనున్న నేపథ్యంలో సిబ్బంది ఇంకా పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం ప్రత్యేకంగా 100 ఎకరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి 50 ఎకరాలు కేటాయించాలన్నారు. ఇతర అవసరాలకు మరో 50 ఎకరాలు వినియోగించాలన్నారు.

​నాలుగు వరుసల రోడ్డు మంజూరు..

పవర్‌ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్‌ సర్వీస్ ఉద్యోగులకు అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం కూడా చేపట్టాలని కేసీఆర్ తెలిపారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్‌ వరకు 7 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.

​ప్రభాకర్ రావుకు అభినందనలు..

యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో 2 యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తవుతాయని.. మిగతావి జూన్ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు.. సీఎం కేసీఆర్‌కి తెలిపారు. కరోనా వల్ల ఏడాదిన్నరకు పైగా ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రభాకర్ రావు సీఎంకి వివరించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావును కేసీఆర్ అభినందించారు.

​అక్కడిక్కడే తగుచర్యలు..


విద్యుత్‌ కేంద్రం కోసం భూమి ఇచ్చిన రైతులతో పాటు, గతంలో సాగర్‌ ప్రాజెక్టుకు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు కలెక్టర్‌ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించిన కేసీఆర్.. అక్కడిక్కడే తగుచర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

Read More:

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.