నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
శరవేగంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సందర్శించనున్నారు. తుదిదశ పనులను పరిశీలించడి పలు సూచనలు చేయనున్నారు.
Samayam Telugu 14 Sep 2021, 8:48 am
ప్రధానాంశాలు:
- పసిడి కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి ప్రధానాలయం
- ఆలయం తుది దశ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి
- 17న మరోసారి చినజీయర్స్వామితో కలసి రానున్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు యాదాద్రికి చేరుకోనున్న ఆయన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ తుదిదశ పనులు పరిశీలించనున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అయిన కేసీఆర్... యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ఆయన్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధానికి తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంఓ ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి తరుచూ సమీక్షలు నిర్వహిస్తూ ఆలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. మరోవైపు ఈ నెల 17న చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు యాదాద్రి ఉద్ఘాటన సందర్భంగా ఆలయంలో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని గతంలోనే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమారు 3వేల మంది వేదపండితులు, రుత్విక్కులతో యాగం మహోన్నతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఉద్ఘాటనతో పాటు యాగ నిర్వహణ చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్వహించనున్నారు.
యాదాద్రీశుడి క్షేత్రం సోమవారం రాత్రి పసిడి కాంతుల్లో కనువిందు చేసింది. ఆలయమంతా బంగారు వర్ణం వెదజల్లేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వైటీడీఏ అధికారులు ట్రయల్ రన్ వేశారు. గతంలో తూర్పు, ఉత్తర రాజగోపురాల వైపు మాత్రమే విద్యుత్ దీపాలను వెలిగించగా.. సోమవారం రాత్రి ఆలయ మండపాలు, రాజగోపురాలు, తిరువీధుల్లోనూ బంగారు రంగులో కనువిందు చేసే విద్యుత్ దీపాలను ట్రయల్ వేశారు.
యాదాద్రీశుడి క్షేత్రం సోమవారం రాత్రి పసిడి కాంతుల్లో కనువిందు చేసింది. ఆలయమంతా బంగారు వర్ణం వెదజల్లేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వైటీడీఏ అధికారులు ట్రయల్ రన్ వేశారు. గతంలో తూర్పు, ఉత్తర రాజగోపురాల వైపు మాత్రమే విద్యుత్ దీపాలను వెలిగించగా.. సోమవారం రాత్రి ఆలయ మండపాలు, రాజగోపురాలు, తిరువీధుల్లోనూ బంగారు రంగులో కనువిందు చేసే విద్యుత్ దీపాలను ట్రయల్ వేశారు.