యాప్నగరం

Alcohol Allergy: ఆగ్రా నుంచి వచ్చిన వ్యక్తికి 'ఆల్కహాల్ అలర్జీ' పాజిటివ్.. తెలంగాణలో ఇదే తొలి కేసు..

Alcohol Allergy: తెలంగాణలో తొలిసారి 'ఆల్కహాల్ అలర్జీ' పాజిటివ్ వ్యక్తిని డాక్టర్లు గుర్తించారు. ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త హైదరాబాద్ రాగా.. అతడు ఆల్కహాల్ అలర్జీతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ సమస్య ఉన్నవారు తమకు ఇష్టమైన బ్రాండ్ తీసుకున్నప్పుడు అలర్జీకి గురవుతారని వైద్యులు తేల్చారు

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 17 May 2023, 11:25 am

ప్రధానాంశాలు:

  • ఆగ్రా నుంచి వచ్చి బిజినెస్‌మెన్‌కు ఆల్కహాల్ అలర్జీ పాజిటివ్
  • తొలి కేసును గుర్తించిన హైదరాబాద్ వైద్యులు
  • మద్యం బ్రాండ్‌ మార్చాలని సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu alcohol
ఆల్కహాల్
Alcohol Allergy: ఆల్కహాల్ అలర్జీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన వైద్యులు గుర్తించారు. ఆగ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 36 ఏళ్ల ఓ వ్యాపారవేత్తకు ఆల్కహాల్ అలర్జీ పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇలాంటి కేసు చూడటం ఇదే తొలిసారి. ఇష్టమైన మద్యం బ్రాండ్‌ను తీసుకున్నప్పుడు బాధితుడు ఆల్కహాల్ అలర్జీకి గురవుతున్నాడు. అతడు మద్యం తీసుకున్న ప్రతిసారీ తీవ్రమైన అలర్జీలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని వైద్యులు తేల్చారు.
ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారి కొన్ని నెలల క్రితం ఒక పార్టీకి హాజరయ్యాడు. ఆ తర్వాత శరీరంపై దద్దుర్లు రావడం, తల తిరగడం, పొడి దగ్గు రావడం, ముఖం ఎర్రబడటం లాంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రులలో చూపించుకోగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌కు చికిత్స కోసం వచ్చాడు. అక్కడి వైద్యులు అతడిని పరిశీలించి ఆల్కహాల్ ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షల్లో ఆ వ్యాపారవేత్తకు ఆల్కహాల్ అలర్జీ పాజిటివ్‌గా తేలింది. అలాగే అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్టు, కంప్యూటర్ లగ్ ఫంక్షన్ టెస్ట్ కూడా నిర్వహించారు. అతడి రక్తంలో హిస్టామిన్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో పాటు చికెన్, మటన్, వేరుశెనగ, మసాలా యాంటిజెన్‌, హిస్టామిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా ఆస్తమాతో కూడా అతడు బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో అలర్జీ అనిపించే ఆల్కహాల్ బ్రాండ్‌కు దూరంగా ఉండాలని అతడికి వైద్యులు సూచించారు. ఆల్కహాల్ తీసుకునే ముందు డైల్యూట్ చేయాలని, మద్యం తాగే సమయంలో హై హిస్టామిన్ ఫుడ్, స్నాక్స్‌ను తీసుకోవద్దని తెలిపారు. మద్యం తాగడానికి ముందే యాంటిహిస్టామైన్ టాబ్లెట్‌ను తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. కార్క్ ఆధారిత మూతలతో ప్యాక్ చేసిన మద్యం బ్రాండ్‌లకు దూరంగా ఉండాలని రోగికి డాక్టర్లు సలహా ఇచ్చారు. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఆల్కహాల్ అలర్జీకి గురయ్యే అవకాశముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుర్తించబడని ఆల్కహాల్ అలర్జీ కేసులు చాలా ఉంటాయని అంటున్నారు.

చాాలామంది పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి కేసులు బయటపడటం లేదని వైద్యులు చెబుతున్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమైనా.. చాలామంది బానిసలుగా మారుతూ ఉంటారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.



  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.