యాప్నగరం

ఎమ్మార్వోను చంపడానికి కారణమిదే.. సురేశ్ భార్య లత సంచలన వ్యాఖ్యలు

Abdullapur MRO విజయా రెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేశ్ భార్య లత సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశారని.. నెల తర్వాత ఇస్తానన్న వినలేదని చెప్పారు.

Samayam Telugu 8 Nov 2019, 4:33 pm
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయా రెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేశ్ భార్య లత సంచలన ఆరోపణలు చేశారు. లంచం కోసం వేధించడం వల్లే తహశీల్దార్ విజయా రెడ్డిని తన భర్త సజీవ దహనం చేశాడని చెప్పారు. ఎమ్మార్వో విజయా రెడ్డి లంచం డిమాండ్ చేశారని.. నెల తర్వాత ఇస్తానని చెప్పినా వినలేదని తన భర్త చెప్పినట్లు ఆమె తెలిపారు. తహశీల్దార్ సజీవ దహనం ఘటనపై శుక్రవారం (నవంబర్ 8) ఆమె మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu kura latha
కూర లత


‘భూమి విషయంలో నా భర్త సురేశ్.. తహశీల్దార్ విజయా రెడ్డి వద్దకు వెళ్లారు. భూమి, కోర్టు కేసులతోనే ఆయన అప్పుల పాలయ్యాడు. కోర్టు కేసుల కోసం మా అత్త బంగారం తాకట్టు పెట్టారు. ఉన్న భూమి అమ్మి, అప్పు తీర్చి, ఇల్లు కట్టాలని అనుకున్నాడు’ అని లత తెలిపారు.

Also Read: ఎమ్మార్వోను చంపినట్లు నిన్నూ తగులబెడుతా.. వీడియో వైరల్

భూమి విషయంలో తన భర్త రెండు నెలలుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతూ మానసిక వేదనకు గురయ్యారని లత చెప్పారు. ‘నా ఆస్తి నేను అమ్ముకోలేకపోతున్నానని ఆయన బాధపడేవాడు. నిద్రలో కూడా భూమి పోతుందని ఏడ్చేవాడు’ అని చెబుతూ లత కంటతడి పెట్టారు.

‘ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పినా ఎమ్మార్వో వినలేదట. లంచం ఇవ్వడం నా భర్తకు నచ్చదు. నెల రోజులుగా భూమి గురించే ఆలోచిస్తూ పిచ్చోడిలా తయారయ్యాడు’ అని లత తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన భర్త సురేశ్ తనతో చివరిసారి మాట్లాడారని ఆమె వెల్లడించారు.

Must Read: పీసీసీ చీఫ్ పదవికి తీవ్ర పోటీ.. టీకాంగ్రెస్‌లో వర్గ పోరు

సురేశ్ అమాయకుడని.. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి అతడు ఎప్పుడూ వెళ్లలేదని అతడి కుటుంబసభ్యులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఎమ్మార్వోపై దాడికి అతడిని ఎవరో ఉసిగొల్పారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి ఘటన వెనుక ఎవరున్నారో గుర్తించాలని పోలీసులను డిమాండ్ చేశారు. తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తహశీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు సురేశ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు స్వగ్రామంలో గౌరెల్లిలో గురువారం రాత్రి నిర్వహించారు.

Watch: ఎమ్మార్యో హత్య.. సీసీటీవీ దృశ్యాల్లో నిందితుడు

ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం నిందితుడు సురేశ్ కాలిన గాయాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాడిలో మంటలు అంటుకోవడంతో సురేశ్.. తహశీల్దార్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత తన ప్యాంట్, షర్ట్ విప్పేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ ముందు కుప్పకూలాడు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.