యాప్నగరం

KTR: కాబోయే ప్రధాని కేటీఆర్.. దావోస్ వేదికగా సరికొత్త ప్రచారం.. టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ ఖుషీ!

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో వ్యాపారవేత్తలను కలుస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తీరును గమనించిన వెంచర్ క్యాపిటలిస్ట్ ఆశా జడేజా.. వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ దేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ప్రశంసలు గుప్పించారు. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 25 May 2022, 1:17 pm

ప్రధానాంశాలు:

  • దావోస్ పర్యటనలో కేటీఆర్
  • వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌లో బిజీ బిజీగా మంత్రి
  • కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించిన వెంచర్ క్యాపిటలిస్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ktr at davos
telangana minister ktr at davos
KTR | తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల ముందే థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసినప్పటికీ మోదీ మేనియా కారణంగా ఫలితాన్ని ఇవ్వలేదు. చాలా కాలంపాటు సైలెంట్‌గా ఉండిపోయిన కేసీఆర్ (KCR).. మరోసారి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీలతో కూటమి ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల పర్యటనకు వెళ్లి షెడ్యూల్ కంటే ముందు హైదరాబాద్ వచ్చేసిన గులాబీ బాస్.. మళ్లీ రాష్ట్రాల బాట పట్టనున్నారు. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చాలని కొందరు సూచిస్తున్నారంటూ.. కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఆయన తనయుడు కేటీఆర్ మాత్రం దావోస్ (Davos) వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో (World Economic Forum Summit) మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌, ఆయన చొరవను వెంచర్ క్యాపిటలిస్ట్ ఆశ జడేజా మొత్వానీ ప్రశంసించారు. మరో 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధాని అయినా ఆశ్చర్యపోవద్దంటూ ఆమె ట్వీట్ చేశారు. ఓ యువ రాజకీయ నాయకుడు ఇంత విజన్‌తో ఉండటం.. స్పష్టంగా అభిప్రాయాలను వెల్లడించడాన్ని తాను ఇంత వరకూ చూడలేదంటూ ఆమె కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆశా జడేజా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఇది మా నాయకుడి పనితనం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కాబోయే ప్రధాని కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా, కేటీఆర్‌ను ప్రమోట్ చేయడం కోసమే ఆశా జడేజా ఈ ట్వీట్ చేశారంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. విభజనవాది అయిన కేటీఆర్ దేశ ప్రధాని ఎలా అవుతారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. కేటీఆర్ మోడ్రన్ చంద్రబాబు నాయుడు అని మరో నెటిజన్ స్పందించాడు.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. అంతర్జాతీయ వేదికపై కేటీఆర్‌కు ప్రశంసలు రావడం మాత్రం హర్షించదగిన పరిణామమే. విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరానికి మరింతగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఆయన పడుతున్న తపనను అభినందించాల్సిందే. కేటీఆర్ రాజకీయ ప్రస్థానంలో మంత్రిగా దాదాపు 8 ఏళ్లు మాత్రమే పని చేశారు. ప్రభుత్వ పనితీరుపై ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకూ కాబోయే సీఎం కేటీఆర్ అనే ప్రచారం మాత్రమే జరుగుతుండగా.. ఇప్పుడు ఆయన కాబోయే ప్రధాని అనే ప్రచారం బయల్దేరింది. మరి ఆయన పీఎం అవుతారా..? అనేది కాలమే తేల్చనుంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.