యాప్నగరం

అమిత్ షాను హిట్లర్‌తో పోల్చిన అసదుద్దీన్.. లోక్‌సభలో కంటతడి, పౌరసత్వ బిల్లు ప్రతుల చించివేత

Amit Shah: లోక్‌సభలో పౌరసత్వ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. బిల్లు ప్రతులను చించివేసి నిరసన తెలిపారు.

Samayam Telugu 9 Dec 2019, 11:45 pm
హిట్లర్‌ తరహాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా చరిత్రలో నిలిచిపోతారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై సోమవారం (డిసెంబర్ 9) లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు భారత రాజ్యాంగానికే విరుద్ధమని ధ్వజమెత్తారు. గాంధీజీకి ఏ అంశాలు ‘మహాత్మా’ అనే బిరుదును సంపాదించి పెట్టాయో.. బీజేపీ ప్రభుత్వం అవే అంశాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో అసలు ముస్లింలను లేకుండా చేయడమే మీ లక్ష్యమా అని ప్రశ్నించారు.
Samayam Telugu అసదుద్దీన్ ఒవైసీ


ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి గురైన మజ్లిస్ ఎంపీ సభలో కన్నీరు పెట్టుకున్నారు. పౌరసత్వ బిల్లు ప్రతులను చించేసి నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షాను హిట్లర్‌తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

భారత్‌లో సెక్యులరిజం మౌలికమైందని ఒవైసీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో భారత్‌.. మరో ఇజ్రాయిల్‌గా మారుతుందని విమర్శించారు. దేశంలో ఇంత మంది నివసిస్తుండగా ముస్లింల మీదే ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు.

పొరుగు దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన వారిలో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు అనేక మతాల వారు ఉన్నారని అసదుద్దీన్ చెప్పారు. వారందరినీ అక్రమ వలసదారులుగా పరిగణించకుండా కేవలం ముస్లింల పైనే వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. శ్రీలంక నుంచి వలస వచ్చిన అనేక మంది తమిళనాడులో అక్రమంగా నివసిస్తున్నారని గుర్తు చేశారు.

పౌరసత్వ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్ తదితర దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే.. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలను బిల్లు నుంచి తప్పించారు. టీఆర్‌ఎస్‌, సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సీపీఐ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు, ఎఐయూడీఎఫ్‌ ఎంపీలు ఈ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయగా.. వైసీపీ సమర్థించింది. అయితే, తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.