యాప్నగరం

అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారత రైతు.. పద్మ శ్రీ చింతల వెంకట రెడ్డి

మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా.. సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేస్తున్న చింతల వెంకటరెడ్డికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

Samayam Telugu 11 Dec 2022, 10:57 am
కేంద్రం తాజాగా పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం విశేషం. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం.. తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి, విజయసారథి శ్రీభాష్యంకు పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. ఏపీ నుంచి యడ్ల గోపాల రావు, దళవాయి చలపతిరావులకు పద్మ శ్రీ పురస్కరాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన చింతల వెంకట రెడ్డి నాలుగు దశాబ్దాలుగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు.
Samayam Telugu farmer
రైతు


సికింద్రాబాల్‌లో అల్వాల్ ప్రాంతానికి చెందిన చింతల వెంకట రెడ్డి అంతర్జాతీయ పేటెంట్‌ పొందిన తొలి భారతీయ రైతుగా గుర్తింపు పొందారు. పొలంలోనే మట్టిని తవ్వి బయటకు తీసి, ఎండబెట్టి దాన్నే ఎరువుగా వాడతారు. అంతే కాదు... ఆ మట్టినే నీటిలో కలిపి పురుగు మందుగానూ పంటపై పిచికారి చేస్తారు. అంటే ఆయన పండించే పంటకు మట్టే పురుగు మందు, మట్టే ఎరువు. దీంతో ఆయన సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించే విధానం అందర్నీ ఆకర్షించింది.

ద్రాక్ష సాగులో వెంకటరెడ్డి వినూత్న ప్రయోగాలు చేపట్టారు. కీసరలోని కుందనపల్లిలో ఆయనకు ద్రాక్ష తోట ఉంది. అల్వాల్‌లో రీసెర్చ్ ఫామ్ ఉంది. ఆయన పండించిన ద్రాక్ష పండ్లను అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్ రుచి చూడటం విశేషం. అనాబ్‌-ఇ-షాహీ ద్రాక్ష సాగు చేసి హెక్టార్‌కు 105 టన్నులు దిగుబడి సాధించిన వెంకటరెడ్డి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 2006లో ఆయన ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు.

విటమిన్ ఏ, సీ ఉన్న బియ్యాన్ని పండిస్తూ.. రేచీకట్లను పారదోలే ప్రయత్నం చేస్తున్నారాయన. చెరువు మట్టిని తీసుకొచ్చి ఎండబెట్టి.. బస్తాల్లో నిల్వ చేసి దఫ దఫాలుగా పంటకు ఎరువుగా వాడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.