యాప్నగరం

Girijana Bandhu: కేసీఆర్ మరో నినాదం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్, కొత్త డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి!

Girijana Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దళిత బంధు తరహాలో గిరిజన బంధు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో తెరపైకి మరిన్ని డిమాండ్లు వస్తున్నారు. వీటి తరహాలో బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ ఊపందుకుంటున్న తరుణంలో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అన్న అనుమానాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్నాయి.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 19 Sep 2022, 4:57 pm

ప్రధానాంశాలు:

  • సంపద పెంచు.. ప్రజలకు పంచు.. కేసీఆర్ కొత్త నినాదం
  • దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామని ప్రకటన
  • అయితే అన్ని వర్గాల నుంచి డిమాండ్లు పెరిగే అవకాశముందని ఆందోళన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu KCR
తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్(KCR) ప్రకటనల లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికలేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ఆయన మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నోట కొత్త నినాదం వినిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్ చెబుతున్నది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో బెడిసికొడితే మాత్రం మొదటికే మోసం రావడం ఖాయమని టీఆర్ఎస్(TRS) సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో పాల్గొన్న కేసీఆర్ దళిత బంధు(dalit bandhu) మాదిరిగానే గిరిజన బంధు(girijana bandhu) ఇస్తామని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ(Telangana) ప్రజల ఆదాయం పెరిగిందని చెప్పిన ఆయన... 'సంపదను పెంచు ప్రజలకు పంచు' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పడం చర్చనీయాంశమైంది.
Munugode Bypoll: ఫిరాయింపుదారుల ఆశాదీపం... మునుగోడుపైనే అందరి ఆశలు
తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న బీజేపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలం కావడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలకు తోడు కేంద్రమంత్రులు తరుచూ హైదరాబాద్ వస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు జాతీయ రాజకీయాల్లనూ చక్రం తిప్పాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళిత బంధు ప్రకటించిన ఆయన.. మునుగోడు ఉపఎన్నిక వేళ గిరిజన బంధు పథకాన్ని చర్చలోకి తీసుకొచ్చారు.
బీజేపీకి చెక్ పెట్టేందుకేనా?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఉచితాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయ తాయిలాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో కూరుకుపోతుందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. బీజేపీ నుంచి ఉచితాల విషయంలో విమర్శలు వస్తున్న వేళ ‘సంపదను పెంచు.. ప్రజలకు పంచు’ అనే నినాదాన్ని ఎత్తుకోవడం బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ పన్నిన వ్యూహంగా తెలుస్తోంది.
Sangareddy Collector: కేసీఆర్ ఎక్కడ.. అంబేద్కర్ ఎక్కడ.. సంగారెడ్డి కలెక్టర్‌‌పై కాంగ్రెస్ ఆగ్రహం
మరిన్ని ‘బంధు’ల కోసం డిమాండ్లు!
కేసీఆర్ ‘గిరిజన బంధు’ ప్రకటించడంతో అనూహ్యంగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, డబ్బులే ఇవ్వాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గొర్రెల స్థానంలో నగదు బదిలీ చేస్తే నచ్చిన చోట లబ్దిదారులు గొర్రెలు కొనుగోలు చేస్తారని, అనువు కాని ప్రాంతాల్లో ఇతర మార్గాలను ఎంచుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దళిత బంధు తర్వాత గిరిజన బంధు ప్రకటించిన నేపథ్యంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన కొత్త డిమాండ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ ఏర్పడింది.
KTRని కదిలించిన ఓ తల్లి రాసిన లేఖ.. ఆ అధికారులకు స్పెషల్ రిక్వెస్ట్
ఇరకాటంలో ప్రభుత్వంమొన్న దళిత బంధు, నేడు గిరిజన బంధు.. ఇలా కేసీఆర్ చేస్తున్న ప్రకటనలతో ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దళిత బంధు తరహాలోనే బీసీ బంధు ప్రకటించాలని గతంలోనూ డిమాండ్లు వచ్చాయి. బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోనూ అనేక మంది పేదలు ఉన్నారని, వారంతా ఆర్థికంగా చితికిపోయిన స్థితుల్లో బతుకీడుస్తున్నారని, ఇలాంటి వారికి సైతం నగదు బదిలీ చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కొన్ని సామాజిక వర్గాలకు డబ్బులు పంచి.. మిగతా వర్గాలను విస్మరిస్తే ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.. నగదు బదిలీ కారణంగా మరింత దిగజారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు జరుగుతున్నాయి
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.