యాప్నగరం

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. వెంటనే బండి సంజయ్‌‌‌కు పిలుపు, మర్మమేంటో?

Delhi: సీఎం కేసీఆర్‌ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఆదివారంతో ముగిసింది. దీంతో వెంటనే ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, హర్దీప్ సింగ్ పురి, గజేంద్ర షెకావత్ తదితరులను కలిశారు.

Samayam Telugu 13 Dec 2020, 3:22 pm
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలవడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో కేంద్ర పెద్దలపై ఎన్నో విమర్శలు చేసిన నేపథ్యంలో సీఎం అడగ్గానే ప్రధాని, మంత్రులు అపాయింట్‌మెంట్లు సులభంగా వచ్చేశాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఏం జరుగుతోందన్న ఆసక్తి పెరిగిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనుల మంజూరు కోసమే అని బయటికి చెబుతున్నా.. ఆ భేటీలో ఏం జరిగిందన్నది మాత్రం ఎవరికీ తెలియదు. రాజకీయ పరమైన ఒప్పందాలేమోనని ఎవరికి వారు అంచనా వేసేసుకుంటున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్యే సీఎం కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది.
Samayam Telugu కేసీఆర్, బండి సంజయ్
kcr, bandi sanjay


తాజాగా కేసీఆర్ పర్యటనకు మరింత ఆసక్తి కలిగించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా ఢిల్లీకి పిలవడం మరిన్ని చర్చలకు తావిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత బండి సంజయ్ అప్పుడే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల ఆశీస్సులు తీసుకొనే వచ్చారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడంపై ఆసక్తి నెలకొంది. అదీకాక, కేసీఆర్ పర్యటన ముగిసిన వెంటనే ఈయన హస్తినకు బయల్దేరడంతో ఎన్నో ఊహాగానాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ముగిసిన కేసీఆర్ పర్యటన
సీఎం కేసీఆర్‌ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఆదివారంతో ముగిసింది. దీంతో వెంటనే ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, హర్దీప్ సింగ్ పురి, గజేంద్ర షెకావత్ తదితరులను కలిశారు. తెలంగాణకు వరద సాయం చేయాలని అమిత్ షాతో పాటు మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25 వేల కోట్లు అందించాలని నీతి ఆయోగ్‌ సూచించిందని, ఈ విషయంలో సహకారం అందించాలని సైతం మోదీని కోరారు.

ఢిల్లీకి బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ నేతలను ఆయన కలవనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను సీఎం కేసీఆర్ కలిసిన వేళ బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలవడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.