యాప్నగరం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటేసి..

భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. నీటి మట్టం వేగంగా పెరుగుతోంది.

Samayam Telugu 15 Aug 2020, 2:52 pm
ఉత్తర తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువన ఉన్న ఉపనదులు, వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తుండటంతో.. గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారు జామున భద్రాచలం వద్ద శనివారం ఉదయం 3.50 గంటలకు గోదావరి వరద 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చటిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరద 46 అడుగులు దాటింది. ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో ఈరోజే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది.
Samayam Telugu godavari


భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో వరద పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు అడిషనల్ కలెక్టర్ అనుదీప్ అశ్వాపురం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

శబరి, గోదావరి నదుల వరద ప్రవాహం పెరగడంతో... చట్టి నుంచి కుంట వెళ్లే రోడ్డు, చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి నీట మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు దిగువన ఆంధ్రాలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో లంక గ్రామాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి ఉద్ధృతికి దేవీపట్నం సమీపంలో గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. రహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. పోలవరం వద్ద గోదావరి తీవ్ర రూపం దాలుస్తోంది. కొత్తూరు కాజ్‌వే వద్ద వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.