యాప్నగరం

Hyderabad Bandh: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు బంద్

నగరంలో ఇవాళ సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు తిరగకుండా బంద్ పాటిస్తున్నాయి. అటు ఆటో సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి.

Samayam Telugu 8 Dec 2020, 8:16 am
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఇవాళ రోడ్డెక్కకుండా బంద్ పాటిస్తున్నాయి. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తలపెట్టిన 'భారత్‌ బంద్‌' నేపథ్యంలో రైతులకు సంఘీభావంగా నగరంలో కూడా మంగళవారం బంద్‌ పాటించనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు.. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 3 గంటల వరకు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. దీంతో నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు సోమవారం రాత్రే బయలు దేరాయి. మంగళవారం ఉదయం 7 గంటలలోపు గమ్యస్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Samayam Telugu హైదరాబాద్ బంద్


మరోవైపు నగరం నుంచే కాకుండా.. దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కూడా మంగళవారం ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. వ్యాపార సంస్థలు కూడా మధ్యాహ్నం వరకు బంద్‌ పాటించే సూచనలు ఉన్నాయి. మరోవైపు రైతులు చేస్తున్న బంద్‌కు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు బంద్‌ చేయనున్నట్లు ఆటో డ్రైవర్స్‌ యూనియన్ల జేఏసీ ప్రకటించింది.

Read More : బండిని కలిసిన ఎంపీడీఓ సస్పెన్షన్.. ఉద్యోగ సంఘాల్లో దుమారం

మరోవైపు భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌కు మద్దతు తెలుపుతూ సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. ఉద్యోగులతో పాటు కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు బంద్‌కు మద్దతు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.