యాప్నగరం

ఖైరతాబాద్ గణపతి తొలిపూజలో దత్తన్న.. ఈ నెల 5న హిమాచల్‌ గవర్నర్‌గా ప్రమాణం

ఖైరతాబాద్ మహాగణపతికి తెలంగాణ గవర్నర్‌ హోదాలో ఈఎస్ఎల్ నరసింహన్ తొలిపూజ నిర్వహించారు. ఈ పూజలో హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Samayam Telugu 2 Sep 2019, 2:13 pm
పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతికి ఈ క్రతువు ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ గణపతికి 80 అడుగుల వెండి జంధ్యాన్నిసమర్పించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ గవర్నర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నా ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి మళ్లీ వస్తానని అన్నారు. జీవితంలో చివరిసారి అంటూ ఏదీ ఉండదని, ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు స్వామి దర్శనభాగ్యం తనకు దక్కిందని గుర్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ గణేశుడు తెలంగాణకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఈ గణేశుడి ఉన్నంత వరకు తెలంగాణకు ఎలాంటి కష్టాలు ఉండవని అన్నారు. బంగారు తెలంగాణ కాదు రత్నాల తెలంగాణగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Samayam Telugu khairtabad2


ఈ సందర్భంగా నరసింహన్, బండారు దత్తాత్రేయలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. సెప్టెంబరు 4న హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తానని, 5న ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. మరోవైపు, ఖైరతాబాద్ గణపతి వద్ద సీసీ కెమెరాలు, పోలీసు, ప్రైవేటు సెక్యూరిటీతో భద్రత ఏర్పాట్లు పకడ్బంధీగా చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

కాగా, మహాగణపతికి పూలమాల, ఇతర పుష్పాల అలంకరణల కోసం దాదాపు రూ. 2 లక్షలు వెచ్చించారు. బంతి, చేమంతి, ఆరటి చెట్లు, అశోక చెట్లు తదితరాలు ఈ అలంకరణలో వినియోగించారు. 300 కిలోల బంతిపూలు, 100 కిలోల చామంతులు, 200 కిలోల తమలపాకులు, వంద అశోక చెట్లు, 30 అరటి చెట్లతో స్వామికి అలంకరించారు. ఖైరతాబాద్‌లోని మహాగణపతి వద్ద సోమవారం వేకువజాము నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.