యాప్నగరం

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. అందుకు సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. పోడు భూముల సమస్య పరిష్కరించకుండా ఆ భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటడం సరికాదన్నారు. పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 29 May 2022, 2:22 pm
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. పోడు భూముల సమస్య పరిష్కరించకుండా ఆ భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు పెంపకానికి ఉపక్రమించడం గిరిజనులను మోసం చేయడమేనన్నారు. బీజేపీ తెలంగాణ శాఖ హరితహారం కార్యక్రమానికి వ్యతిరేకం కాదని.. కేవ‌లం పోడు భూముల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల‌ని కోరుతున్నట్లు చెప్పారు.
Samayam Telugu sanjay letter to kcr


‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దాదాపు మూడున్నర లక్షల మంది ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర యంత్రాగాన్ని అంతా తీసుకుని పోయి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో సీఎంగా మీరు స్వయంగా ప్రకటించిన విషయం, నవంబర్‌ 23, 2018న మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడు రైతులకు పట్టాలు అందజేస్తామని మీరు ప్రకటించిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాం..’ అంటూ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ నేత బండ్రు శోభారాణి.. ఆ లీడర్‌కు రేవంత్ చెక్ పెట్టబోతున్నారా?
‘పోడు భూములు సాగు చేసుకుంటున్న వారి నుంచి అక్టోబర్‌ నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలనకు నవంబర్‌లో సర్వే ప్రారంభించాలని, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పట్టాలు ఇవ్వాలని 2021 అక్టోబర్‌లో మీరు నిర్వహించిన హైలెవల్‌ మీటింగ్‌లో నిర్ణయించారు. 2019 అసెంబ్లీలో మీ ప్రకటన నుంచి ఇప్పటివరకు పోడు భూముల సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంది..’ అని సంజయ్ ఆక్షేపించారు.

‘రాష్ట్రంలో 24 జిల్లాల్లో 10 లక్షలకు పైగా పోడు భూముల పట్టాల సమస్య ఉంది. 2,450 ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు పోడుభూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పోడుభూములకు పట్టాల కోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు ఆ భూముల్లో హరితహారానికి ఫారెస్ట్‌ అధికారులు సన్నాహం చేయడం గర్హనీయం. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా పోడుదారులకు పట్టాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంది. పోడుభూముల సమస్య పరిష్కరించకుండా పోడు భూముల్లో హరితహారం చేపడితే ఎదురయ్యే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోడుభూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులకు, ఆదివాసీలకు బీజేపీ పూర్తి అండదండలు అందజేస్తుంది..’ అని సంజయ్ లేఖలో సర్కార్‌ను హెచ్చరించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.