యాప్నగరం

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌కి అస్వస్థత.. యాత్రపై క్లారిటీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆ పార్టీ నేత రుద్రమ తెలిపారు. వైద్యుల సూచనల మేరకు ఆయన పాదయాత్ర కొనసాగిస్తారని స్పష్టం చేశారు.

Samayam Telugu 25 Apr 2022, 8:37 pm
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతోంది. వనపర్తి, నారాయణపేట్‌ జిల్లాలో సంగ్రామ యాత్ర కొనసాగనుంది. గత పన్నెండు రోజులుగా నడిఎండలో పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్‌కి వడదెబ్బ తగలింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు పాదయాత్ర కొనసాగించిన సంజయ్ నీరసంగా కనిపించారు. దీంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని వైద్యులు సూచించారు.
Samayam Telugu bandi


వైద్యుల సూచనల మేరకు రెండు రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నట్ల ప్రచారం జరిగింది. మక్తల్ చేరుకున్న అనంతరం ఆయన పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇస్తారని అంతా భావించారు. అయితే ఎలాంటి విరామం తీసుకోవడం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. బండి సంజయ్ నీరసంగా ఉన్నప్పటికీ పాదయాత్ర కొనసాగుతుందని.. వైద్యుల సూచనలతో ఆయన యాత్ర సాగిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలియజేశారు. నారాయణపేట్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది.

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా నియమితులైప్పటి నుంచి బండి సంజయ్ చురుగ్గా వ్యవహరిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడే ఆయన రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. తొలివిడత యాత్ర పూర్తి చేసిన సంజయ్.. పన్నెండు రోజుల కిందట రెండో విడత యాత్ర ప్రారంభించారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హాజరవనున్నట్టు సమాచారం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.