యాప్నగరం

కేబినెట్ విస్తరణ ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్చలు!

Telangana మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షకీల్.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం చర్చనీయాంశమైంది.

Samayam Telugu 12 Sep 2019, 3:43 pm
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేపట్టిన్న కేబినెట్ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో పెద్ద చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు. కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని నాయిని నరసింహ రెడ్డి, కేబినెట్‌లో మాదిగలకు చోటివ్వలేదని మరో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడంతో వారంతా మెత్తబడ్డారు. అయితే, తాజాగా మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu ArvindShakil


నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు. అయితే రెండో విడత కేబినెట్ విస్తరణలో కచ్చితంగా చోటిస్తాననని కేసీఆర్ తనకు మాట ఇచ్చారని షకీల్ సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లు సమాచారం.

Read Also: మంత్రి పదవి వస్తుందని ఆశ ఉండే..: మీడియా ముందు కంటతడి పెట్టుకున్న రామన్న

దీంతో మైనార్టీ కోటాలో ఈసారి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కానీ, ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు లభించలేదు. దీంతో షకీల్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఎమ్మెల్యే షకీల్ గురువారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, జిల్లాలోని అనేక రాజకీయ విషయాలపై ఇద్దరి మధ్య లోతైన చర్చ జరిగింది. ఈ క్రమంలోనే షకీల్ పార్టీ మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా, టీఆర్ఎస్‌లో ఇంకా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారనే వివరాలను అర్వింద్.. షకీల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన తిరుగుబాటే గుర్తుకు వస్తోంది: విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుసహా ముఖ్య నేతలను కమలం గూటికి చేర్చింది. తాజాగా మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ నేతలను బీజేపీ తన గూటికి చేర్చుకునే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.