యాప్నగరం

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ మృతి

Khammam జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

Samayam Telugu 10 Sep 2019, 12:17 pm
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. మరో డ్రైవర్‌ సహా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్ 10) అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Accident


ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వస్తున్న ఏలూరు డిపో బస్సు.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న తాండూరు డిపో బస్సు తల్లంపాడులోని ఓ మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లు కేబిన్లలో ఇరుక్కుపోయారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు డ్రైవర్లను బయటకి తీశారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏలూరు బస్సు డిపో డ్రైవర్ కిరణ్(40) అక్కడికక్కడే మృతి చెందాడు. తాండూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ జంగయ్యకు, మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.