యాప్నగరం

మత రాజ్యంలా మార్చాలని చూస్తున్నారు.. దమ్ముంటే నాతో చర్చించండి: ఒవైసీ

బీజేపీ సర్కారు భారత్‌ను మత రాజ్యంగా మార్చాలని చూస్తోందని ఎఐంఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై మండిపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ విషయమై చర్చకు తాను సిద్ధమన్నారు.

Samayam Telugu 22 Jan 2020, 3:49 pm
పౌరసత్వ సవరణ చట్టం విషయమై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేసుకున్నారు. సీఏఏను అమలు చేయడం ద్వారా బీజేపీ సర్కారు భారత్‌ను మత రాజ్యంలా మార్చాలని చూస్తోందని.. ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌లో అన్ని మతాలూ సమానమే. అందుకే భారత్ లౌకిక దేశం, ఎప్పటికీ పాకిస్థాన్‌లా మత రాజ్యం కాద’ని రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఏజెన్సీ పీటీఐ ట్వీట్ చేయగా.. దానికి బదులిస్తూ ఒవైసీ కేంద్రాన్ని టార్గెట్ చేశారు.
Samayam Telugu owaisi indiatimes


ఢిల్లీలోని ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంపులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో మత వివక్ష ఎప్పటికీ ఉండదు. మన పొరుగున ఉన్న దేశం ఓ మతాన్ని అధికారికంగా ప్రకటించుకుంది. తమకు తాముగా వాళ్లు మత రాజ్యంగా ప్రకటించుకున్నారు. మేం అలా ప్రకటించలేదు’ అన్నారు. పాకిస్థాన్ మాత్రమే కాదు అమెరికా కూడా మత రాజ్యమేనన్న రాజ్‌నాథ్.. భారత్ మత రాజ్యం కాదన్నారు. మన సాధువులు, యోగులు కేవలం ఈ భూభాగంలో నివసించే వారినే మన కుటుంబంగా చూడలేదు. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా పరిగణించారు అని రక్షణ మంత్రి తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం విషయమై చర్చకు రండంటూ.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌లకు అమిత్ షా సవాల్ విసరడంపై ఒవైసీ స్పందించారు. వారితో చర్చ ఎందుకు, నాతో చర్చించండంటూ అమిత్ షా‌కు అసదుద్దీన్ సవాల్ విసిరారు. కరీంనగర్‌లో మాట్లాడిన ఆయన.. సీఏఏతోపాటు ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీసీ విషయమై చర్చకు సిద్ధమన్నారు. ‘మీరు నాతో చర్చించండి. నేను ఇక్కడున్నాను. వాళ్లతో చర్చ దేనికి? గడ్డం ఉన్న వ్యక్తితో చర్చ జరపండి. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీలపై వాళ్లతో నేను చర్చిస్తా’ అని ఒవైసీ అమిత్ షా‌కు సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.