యాప్నగరం

కేసీఆర్‌పై తప్పుడు వార్త.. ఖమ్మం టు హైదరాబాద్ హై డ్రామా.. మీడియా సంస్థపై కేసు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా అంటూ తప్పుడు వార్త ప్రచురించిన మీడియా సంస్థపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఖమ్మంలో ఉన్న జర్నలిస్టును కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు.

Samayam Telugu 6 Jul 2020, 3:53 pm
కేసీఆర్‌కు కరోనా..? అంటూ తప్పుడు వార్తను ప్రచురించిన ‘ఆదాబ్ హైదరాబాద్’ మీడియా సంస్థపై కేసు నమోదైంది. ఆ పత్రికలో పనిచేసే రిపోర్టర్‌తోపాటు యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్‌కు కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ.. రెండు రోజుల క్రితం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో.. హైదరాబాద్‌లోని రహమత్ నగర్‌కు చెందిన ఇలియాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu kcr
Telangana chief minister K Chandrasekhar Rao (File photo)


ఖమ్మంలో ఉన్న ఆ పత్రిక జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు వెస్ట్ జోన్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన్ను కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా హైదరాబాద్ తీసుకొచ్చారని సమాచారం. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనలకు లోనయ్యారు. ఆయన్ను కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. ఆయన్ను హైదరాబాద్ తీసుకొచ్చి విచారించగా.. ఆ వార్త రాసింది తాను కాదని చెప్పారని సమాచారం. ఆ తర్వాత తాను సేఫ్‌గా ఉన్నానని ఆయన తోటి జర్నలిస్టులకు చెప్పారని తెలుస్తోంది.

అనంచిన్ని వెంకటేశ్వరరావు పేరుతో ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ‘‘ఆర్థిక బంధాలు కల్వ‘కోట’లో రాంబదులు’ పేరిట కేసీఆర్ బంధువులను టార్గెట్‌‌గా చేసుకొని వరుస కథనాలను వెలువడుతుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.