యాప్నగరం

ప్రభుత్వ పాఠశాలలో విషాదం.. కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతి

Nizamabad జిల్లా కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోజూ మాదిరిగానే పాఠశాలకు వచ్చిన బాలుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది.

Samayam Telugu 25 Oct 2019, 8:06 pm
తల్లిదండ్రులు తమ పిల్లాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బడికి పంపిస్తే విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. విద్యా శాఖ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి బలయ్యాడు. కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం చోటు చేసుకుంది. పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల నేతల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కోటగల్లి ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. అయినా.. అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల దుస్థితిపై గతంలో మీడియాలో పలుమార్లు కథనాలు వచ్చాయి. అధికారులకు ఎన్నిసార్లు నివేదించినా పట్టించుకున్న నాథుడు లేడు. పేదింటి బిడ్డలు అక్కడ భయంభయంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. తాజా ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది.

Must Read: డెంగ్యూ మరణాలకు ఐఏఎస్‌లదే బాధ్యత.. హైకోర్టు ఆగ్రహం

నిజామాబాద్ జిల్లా కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అయాన్ ఖాన్ (11) అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే స్కూలుకు వచ్చిన అయాన్.. మధ్యాహ్న భోజన సమయంలో మైదానంలో ఆడుకుంటూ.. ఓ చెట్టు వద్ద వేలాడుతున్న కరెంట్ తీగకు ప్రమాదవశాత్తూ తగిలాడు. కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు.

సర్వీస్ వైర్‌ తేలి ఉండటంతో అయాన్.. షాక్‌కు గురైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అయాన్ మృత్యువాతపడిన విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన అతడి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విగతజీవిగా పడిఉన్న అయాన్ వద్ద వారు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

Also Read: హుజూర్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థి సత్తా.. రైతు సమస్యలపై పోటీ; బీజేపీ, టీడీపీలకు షాక్

సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తగిన విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు.. నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. బాలుడి మరణంతో కోటగల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.