యాప్నగరం

రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మున్సిపాలిటీలను ఆదర్శంగా మార్చే బాధ్యత మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లపైనే ఉందన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం (ఫిబ్రవరి 18) నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సులో.. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో వివరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 18 Feb 2020, 7:52 pm
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మున్సిపాలిటీలను ఆదర్శంగా మార్చే బాధ్యత మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లపైనే ఉందన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం (ఫిబ్రవరి 18) నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సులో.. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో వివరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu cm kcr comments on politics in state level municipal conference on pattana pragathi
రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు


బల్దియా.. ఖాయా, పీయా, చల్దియా.. ఆ పరిస్థితి పోవాలి

మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారిందని.. అవినీతికి మారుపేరు అయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ‘బల్దియా.. ఖాయా.. పీయా.. చల్దియా’ అనే సామెతలు పుట్టాయని చెప్పారు. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అవినీతి రహిత వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలని సూచించారు.

అనుకుంటే 6 నెలల్లో రూపురేఖలు మారుతాయి

ప్రజాప్రతినిధులు ఏం చేయాలనే విషయంలో మంచి అవగాహన ఏర్పరచుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలని సూచించారు. అందరినీ కలుపుకునిపోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలన్నారు. గట్టిగా అనుకుని 6 నెలలు కష్టపడితే పట్టణాల రూపురేఖలే మారిపోతాయని చెప్పారు.

అధికారం వచ్చాక మనిషి మారొద్దు..

అధికారం, హోదా వచ్చిన తర్వాత మనిషి మారకూడదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని చూపించొద్దన్నారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, ఛైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని.. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని సూచించారు.

అంత సులభం కాదు, సోయి తప్పి పని చేయవద్దు!

‘పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావొద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు..’ అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు చూస్తే అది తేలిగ్గానే అర్థమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

నాయకుడి మీద ఒక్కసారి నమ్మకం కలిగితే..

‘నాయకులపై ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే.. ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే గొప్ప ఫలితాలు సాధించగులుగుతాం. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. ఇప్పటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇతర దేశాల విజయగాథలు వినడం కాదు..

ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదని.. మనమూ విజయం సాధించాలని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని సీఎం కర్తవ్యబోధ చేశారు. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయని.. వాటిని అధిగమించి ప్రగతికాముకంగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

పట్టణ ప్రగతి కార్యాచరణలో..

పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలతో పాటు కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. 10 రోజుల పట్టణ ప్రగతిలో ఏం చేయాలనే విషయమై అవగాహన కల్పించారు. మున్సిపాలిటీల్లో అన్ని హంగులు ఉన్నాయా? లేదా? నర్సరీలు ఇంకా ఎన్ని అవసరం? చెత్త సేకరణకు ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? ఇళ్లల్లో తడి, పొడి చెత్తబుట్టలు ఉన్నాయా? లేదా? లాంటి అంశాలతో పాటు పట్టణ ప్రగతికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించారు. నేల విడిచి సాము చేయొద్దని.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలని సూచించారు.

గజ్వేల్‌లో ఆ పనులు పరిశీలించండి..

సీఎం కేసీఆర్‌ సమావేశం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గజ్వేల్‌కు బయల్దేరింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు. గజ్వేల్‌లో మార్కెట్లు, శ్మశానవాటికలు తదితరాలను ఈ బృందం పరిశీలించనుంది.

Also Read: కేసీఆర్ బర్త్‌డే: కోతులకు ఆహారాన్నిచ్చే పండ్ల మొక్కలకు శ్రీకారం


Must Read: లాభాల బాటలో ఆర్టీసీ.. ఫలించిన కేసీఆర్ వ్యూహం, త్వరలో బోనస్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.