యాప్నగరం

ఒక్క బొట్టునూ వదలం.. అపెక్స్ కౌన్సిల్ తీరుపై కేసీఆర్ అసంతృప్తి

Pragathi Bhavan: ఏపీ, తెలంగాణ మధ్య జలవివాద పరిష్కారానికి ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ క్రమంలోనే తాజా సమావేశం జరిగింది.

Samayam Telugu 30 Jul 2020, 10:16 pm
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన నీటి హక్కును, వాటాను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, అందుకోసం ఎంతటి పోరాటానికైనా తెలంగాణ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో గురువారం సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాద పరిష్కారానికి ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీ సింగ్ లేఖ రాశారు. ఈ క్రమంలోనే తాజాగా నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Samayam Telugu సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్
CM KCR conducts apex level meeting


కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ ఆగస్టు 5న నిర్ణయించింది. ఆ తేదీన ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో అసౌకర్యం కలుగుతుందన్న భావన వ్యక్తమైంది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ వారికి లేఖ రాయాలని సీఎస్‌కు కేసీఆర్ సూచించారు. ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టిన తీరును సమావేశంలో తీవ్రంగా ఖండించింది. కేంద్రం దుర్మార్గ వైఖరిని ఇకనైనా వదలాలని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్‌కే. జోషి తదితరులు ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.