యాప్నగరం

వరదలు: హైదరాబాద్‌లో 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు.. సీఎం ఆదేశం

Pragathi Bhavan: చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాదు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశించారు.

Samayam Telugu 21 Oct 2020, 5:31 pm
నగరంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలో వరదలు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని అన్నారు.
Samayam Telugu కేసీఆర్ (ఫైల్ ఫోటో)
KCR


చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాదు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువు కట్టల పరిస్థితిని పరిశీలించాలని, ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం కోరారు. ఎక్కడైనా గండ్లు పడినా కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సీఎం కోరారు.

కాగా, భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గత సోమవారం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున తక్షణసాయం ఇస్తామని ప్రకటించారు. వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థికసహాయం అందజేస్తామని చెప్పారు. ఈ సహాయం అందించేందుకు మున్సిపల్‌ శాఖకు రూ.550 కోట్లు విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.