యాప్నగరం

సీఎం కేసీఆర్‌ పకడ్బందీ యాక్షన్‌ ప్లాన్‌.. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష

Pragathi Bhavan: రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం.. అనే అంశం మీద శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 2 Apr 2021, 10:16 pm
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంతోపాటు, టౌన్ హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. ఈ దిశగా అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఆ రెండు జిల్లాల స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr on review


రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం, భవిష్యత్తు అవసరాలను అంచనా వేస్తూ మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం.. అనే అంశం మీద శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్ నగరంతో పాటు సమ్మిళితాభివృద్ధిని కొనసాగించే విధంగా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలి. ఇందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలి.’’

‘‘ఈ జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలకు హైదరాబాద్ నగరంలో మాదిరి విద్య వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తెవాలి. అందుకు ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయో, వాటిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి.’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.