యాప్నగరం

హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక: 30 వేలతో గెలుపుమాదే.. కాదు 25 వేలతో మేమే గెలుస్తాం!

తెలంగాణలో జరిగే ఒకే ఒక్క ఉపఎన్నిక కావడంతో అన్ని పార్టీల దృష్టి హుజూర్‌నగర్‌పై ఉంది. సిట్టింగ్ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ భావిస్తున్నాయి.

Samayam Telugu 22 Sep 2019, 9:41 am
తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగాయి. అన్ని పార్టీల కంటే అధికార టీఆర్ఎస్ ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించిన గోదాలోకి దూకింది. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరు దాదాపు ఖరారయ్యింది. సెప్టెంబరు 23 నోటిఫికేషన్ వెల్లడికానుండగా అదే రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో గెలుపు తమదంటే తమదేనని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu Congress-TRS-750x375


గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డికే మళ్లీ ఆ పార్టీ టిక్కెట్ దక్కింది. ఎన్నారై దొంతిరెడ్డి నరసింహారెడ్డి సైతం టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మాత్రం సైదిరెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గుచూపారు. ఈసారి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఢంకా బజాయిస్తోంది. టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని, 25 వేలు అంతకంటే ఎక్కువ మెజారిటీపై తాము దృష్టి సారించామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానికేతరుడని, ఈసారి ఆయన ఆటలు సాగవని అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలంతా కలిసి వచ్చినా తమ పార్టీ ప్రభంజనాన్ని ఆడ్డుకోలేరని, బీజేపీ ప్రభావం ఏమాత్రం ఉండదని టీఆర్ఎస్ ఉద్ఘాటిస్తోంది. అభివృద్ధిలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం వెనుకబాటుకు ఉత్తమ్‌ కారణమని ఆ పార్టీ ధ్వజమెత్తింది.

ఇదిలా ఉండగా అటు కాంగ్రెస్‌లోనూ విజయం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ పతనం హుజూర్‌నగర్‌ నుంచే ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక నగారా మోగడంతో నేరేడుచర్ల నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ప్రకటించారు. హుజూర్‌నగర్‌లో 30 వేల మెజారిటీతో విజయం సాధిస్తామని ఢంకా బజాయించారు.

ప్రజలపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉత్తమ్ అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలకు టికెట్‌ ఎందుకు కేటాయించడం లేదని టీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సైతం టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.