యాప్నగరం

టీఆర్‌ఎస్‌లోకి అజహరుద్దీన్.. చేరికకు ముహూర్తం ఖరారు!

TRS: టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఆయన విజయం వెనుక మంత్రి కేటీఆర్ సహకారం ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 28 Sep 2019, 5:37 pm
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. అజహరుద్దీన్ ప్యానెల్‌కు సహకరించడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసిన తర్వాత గులాబీ పార్టీలో తన చేరిక గురించి అజార్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Samayam Telugu ktr


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు శుక్రవారం (సెప్టెంబర్ 27) జరిగిన ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అజహరుద్దీన్ ప్యానెల్‌కు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన కొన్ని గంటలకే టీఆర్‌ఎస్‌లో చేరడానికి అజహర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌తో ఈ మేరకు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read: హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ గెలుపు.. టీఆర్‌ఎస్ సహకారం?

ఊహాగానాలన్నీ నిజమైతే.. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో అజహర్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. అజహర్ గెలుపులో తెరవెనుక మంత్రి కేటీఆర్ విశేష కృషి చేసినట్లు సమాచారం. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అజహరుద్దీన్ టీఆర్ఎస్‌‌లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. అయితే.. ఆ తర్వాత ఆయన ఆ వార్తలను ఖండించారు.

Don't Miss: పెళ్లి కోసం రెండేళ్లు ఆగలేను.. 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఎన్నికల్లో అజహరుద్దీన్ ఘన విజయం సాధించారు. మొత్తం 223 ఓట్లు పోలవగా.. అజార్‌కు 147 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి ప్రకాశ్ జైన్‌కు 73 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి దిలీప్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు వచ్చాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 27) హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ ల‌క్ష్మణ్ చివరి నిమిషంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వైస్ ప్రెసిడెంట్‌గా అజహర్ ప్యానెల్‌కు చెందిన జాన్ మనోజ్ విజయం సాధించారు. 49 ఓట్ల ఆధిక్యంతో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా మనోజ్ గెలుపొందారు. ఫలితాల అనంతరం ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో అజారుద్దీన్ వర్గం సంబురాలు చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.