యాప్నగరం

కేసీఆర్ సలహాతోనే ఏపీలో 3 రాజధానులు.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Amaravati సహా ఏపీలో మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. సీఎం కేసీఆర్ సలహాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 21 Jan 2020, 6:19 pm
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (వీహెచ్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానుల పద్ధతి లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకే నిధులు లేవని.. ఇక మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. మంగళవారం (జనవరి 21) హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu vh


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాతోనే ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానిపై నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. సోమవారం వీహెచ్ ఏపీ సందర్శనకు వెళ్లి వచ్చారు.

గతంలో పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్న తీరుపై న్యాయస్థానం స్పందించాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. సొంత పార్టీ నాయకులపైనా ఆరోపణలు గుప్పించారు. విగ్రహం ఏర్పాటు విషయంలో పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా మాట్లాడకపోవడం చాలా విచారకరం అన్నారు.

Must Read: అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తాం: ఈసీ నాగిరెడ్డి

‘వైఎస్ మెమోరియల్‌ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్న మా పార్టీ నాయకులు.. అంబేడ్కర్‌కు జరిగిన అవమానం విషయంలో మాత్రం నోరు మెదపకపోవడం విచారకరం. మనది ఇందిరా కాంగ్రెస్సా? వైఎస్సార్‌ కాంగ్రెస్సా? మా నాయకులు సమాధానం చెప్పాలి’ అని వీహెచ్‌ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా దీనిపై స్పందించాలని.. లేదంటే జనవరి 25 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీని వీడేది లేదని వెల్లడించారు.

పాలనా వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతిని శాసనపరమైన రాజధానిగా, విశాఖను పాలనా పరమైన రాజధానిగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ బిల్లులకు ఆమోదం తెలిపింది. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయనున్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఆ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: టీఆర్‌ఎస్ పార్టీపై ఎంఐఎం అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.