యాప్నగరం

TRS vs Congress: హస్తం పార్టీకి టైం వచ్చిందా..?

దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ షాక్ ఇవ్వనుందా..? దుబ్బాక ఉప ఎన్నికల బరిలో హస్తం పార్టీ బరిలో దిగనుందా? అంటే అవుననే సమాధాం వస్తోంది.

Samayam Telugu 12 Aug 2020, 1:05 pm
టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైనట్లే. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో... అందరి చూపు దుబ్బాక వైపు మళ్లింది. ఎన్నికలు అవసరం లేకుండా ఏకగ్రీవం కావడానికి టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒక వేళ కాంగ్రెస్, బీజేపీ అందుకు ఒప్పుకోకపోతే.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తికరంగా మారింది. ఆయన భార్య లేదా కుమారుడిని గులాబీ పెద్దలు బరిలో దింపే అవకాశం ఉంది.
Samayam Telugu CONGRESS TRS
Picture used for representational purposes only


దుబ్బాకలో ఉప ఎన్నికకే కాంగ్రెస్ పట్టుబట్టొచ్చు. ఎందుకంటే గతంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణిస్తే.. కాంగ్రెస్ ఏకగ్రీవం కోసం ప్రయత్నించింది. వెంకటరెడ్డి భార్యకే టికెట్ ఇచ్చింది. కానీ టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వర రావును బరిలో దింపిన టీఆర్ఎస్.. ఆ ఉప ఎన్నికలో శక్తి వంచన లేకుండా పోరాడి విజయం సాధించింది. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ శ్రేణులు ఇంకా మర్చిపోలేదు. అందుకే ఉప ఎన్నిక కోసం ఆ పార్టీ నేతలు పట్టుబట్టొచ్చు.

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణిని బరిలో దింపాలని.. దివంగత నేతకు ఇదే నిజమైన నివాళి అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. తమ పార్టీ నేతలతో మాట్లాడి ఏకగ్రీవం కావడానికి ప్రయత్నిస్తానన్నారు. జగ్గారెడ్డి చెప్పినట్లుగానే కాంగ్రెస్ ఉప ఎన్నికకు దూరంగా ఉంటే అది ఆసక్తికర పరిణామమే. కాంగ్రెస్ ఏకగ్రీవానికి సహకరించినప్పటికీ.. బీజేపీ ఎంత మేర అంగీకరిస్తుందనేది అనుమానమే. ఎందుకంటే తెలంగాణలో బలపడే ఏ చిన్న అవకాశాన్ని కూడా కాషాయ శ్రేణులు వదులుకోవనే సంగతి తెలిసిందే.

Finance minister T Harish Rao (File photo)


ఉప ఎన్నికలో ప్రత్యర్థులు ఎవరైనా.. పార్టీ తరఫున ఎవరు బరిలో నిలిచినా.. ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు బాధ్యత మాత్రం జిల్లా మంత్రి హరీశ్ రావుదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్.. భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. గతంలో హరీశ్ ఫోకస్ చేసిన పలు నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడమే దీనికి కారణం. టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి కుటుంబీకులు బరిలో దిగితే.. జనంలో ఉన్న సానుభూతికి హరీశ్ రావు చతురత తోడైతే.. దుబ్బాకలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో దుబ్బాక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండగా.. ఈలోగా ఏవైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.