యాప్నగరం

సీఎం పదవి కోసం చాప కింద నీరులా హరీశ్: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Telangana | రాష్ట్ర ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే, టీఆర్ఎస్ నేతలు పార్టీ పదవుల కోసం కొట్టుకుంటున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం హరీశ్ రావు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని ఆరోపించారు.

Samayam Telugu 5 Sep 2019, 10:15 am
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్సన్, సినీనటి విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై ఫేస్‌బుక్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జనం అంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం.. కెసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. రాజకీయాల్లోనూ పాలనాపరంగానూ తనకు అందరికంటే ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్ విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదన్నారు.
Samayam Telugu VijayaHarish


‘ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి.. తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్నప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.’ అంటూ విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
Read Also: వలస నేతలకు పీసీసీ పగ్గాలా.. వీహెచ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదన ఉందని విజయశాంతి ప్రస్తావించారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించి... ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదన్నారు.

జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ వ్యవస్థ ఇప్పటికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేది జగమెరిగిన సత్యమన్నారు. ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ గారిమెడకు చుట్టాలని ఈటెల రాజేందర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారని విజయశాంతి పేర్కొన్నారు.
Read Also: పదవులొచ్చాయని పెద్ద మాటలు మాట్లాడుతున్నరు: కేటీఆర్ వార్నింగ్

అయితే ప్రభుత్వంలో, టీఆ‌ర్ఎ‌స్‌ పార్టీలో ఇంత బీభత్సం జరుగుతున్నా.. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా.. తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి.. తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ... చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైందని విజయశాంతి సంచలన కామెంట్లు చేశారు.

బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అండ్ కో.. అధికార దాహంతో ప్రజల జీవితంతో ఎలా ఆడుకుంటుందో ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతుందని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.