యాప్నగరం

2023 : కాంగ్రెస్‌లోకి ఈటల? వస్తారా.! రేవంత్ సన్నిహితుడి సంచలనం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో లోపాయికారీ ఒప్పందం నిజమేనా? ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నా వచ్చే ఎన్నికలకి ముందు కాంగ్రెస్‌లో చేరతారా? అనే విషయాలపై రేవంత్ సన్నిహితుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 4 Nov 2021, 5:52 pm
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో సంచలనంగా మారారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎదిరించి నిలిచిన ఈటల గురించి అన్ని వర్గాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఆయన రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? బీజేపీ రాజేందర్‌ని ఎలా ఉపయోగించబోతోందనే విషయాలపై రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది.. కానీ కేంద్రంలో అధికారంలో లేకపోవడంతో కేసులు పెట్టి అరెస్టులు చేస్తే కాపాడే అవకాశం లేదన్న ఉద్దేశంతోనే ఆయన కమలం పార్టీ వైపు మొగ్గుచూపారన్న వాదనలున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
eatala


దానికి తోడు ఎన్నికల ముందు ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారని.. ఇద్దరి మధ్యా లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరిగింది. అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు కూడా గుప్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ఈటల కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్యవర్తిత్వం నడిపారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని.. ఆయన బీజేపీలోనే కొనసాగుతారన్న వాదనలు కూడా ఉన్నాయి.

అయితే ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరడంపై ఇష్టారీతిన విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్న అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల పార్టీ మారతాడని తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. టీఆర్‌ఎస్ నుంచి బయటికి రాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి సంప్రదింపులు జరిపినట్లు ఆయన చెప్పారు.

ఇప్పటికే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సింది.. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే కేంద్రంలో అధికారంలో లేం కాబట్టి ఆయన బీజేపీ వైపు వెళ్లారని దయాకర్ అభిప్రాయపడ్డారు. ఈటల రక్షణ కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే రక్షణ ఉంటుందని ఆయన ఆ పార్టీలో చేరినట్లు తాను అనుకుంటున్నానని దయాకర్ అన్నారు. ఇప్పుడు గెలిచారు.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈటల పార్టీ మారే అవకాశాలు లేనట్టేనని ఆయన అన్నారు. ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.