యాప్నగరం

కాంగ్రెస్‌లో లుకలుకలు! జానా రెడ్డి అసహనం? మధ్యలోనే వెళ్లిపోయిన సీనియర్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక అనంతరం జరిగిన రచ్చ తర్వాత మరోమారు నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. సీనియర్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 3 Nov 2021, 6:29 pm
హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బల్మూరి వెంకట్‌ను బలిపశువును చేశారని ఒక సీనియర్ అంటే.. ఈటల రాజేందర్‌కి పరోక్షంగా మద్దతు ఇచ్చారంటూ మరో సీనియర్ ఘాటు విమర్శలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు రావడంతో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఒక్కరి బాధ్యత ఎలా అవుతుందని.. అది కరెక్ట్ కాదని సీనియర్ నేత జానా రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
jana reddy


ఈరోజు గాంధీభవన్‌లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి సీనియర్ నేతలు హాజరయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశానికి హాజరుకానట్లు సమాచారం. ఈ సమావేశంలో సీనియర్ నేత జానా రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఓటమికి తనదే బాధ్యతని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించినట్లు సమాచారం.

పార్టీ ఓటమికి నువ్వొక్కడివే బాధ్యత ఎలా అవుతావు.. సమష్టి బాధ్యత అని జానా రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. అందుకు మహిళా కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా గొంతు కలిపినట్లు సమాచారం. అయితే సమావేశంలో జానా రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తనను చెప్పనిస్తే.. చెప్తానని.. లేదంటే వెళ్లిపోతానని చెప్పినట్లు సమాచారం. అలాగే ప్రతి సమావేశానికి రాలేనని.. తన అవసరం ఉందనుకుంటే వస్తానని ఆయన చెప్పి వెళ్లారని చెబుతున్నారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలు ఉన్నాయని సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు సమాచారం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.