Coronavirus In Telangana: Why Gadwal In Orange Zone And Warangal Urban In Red Zone?
కేసులు ఎక్కువ ఉన్న గద్వాల ఆరెంజ్ జోన్లో.. తక్కువ ఉన్న వరంగల్ రెడ్ జోన్లో.. ఎందుకిలా?
తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్లో ఉండగా.. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. కేసులు ఎక్కువగా నమోదైన గద్వాల జిల్లా ఆరెంజ్ జోన్లో ఉండగా.. పది రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాని వరంగల్ అర్బన్ జిల్లాను రెడ్ జోన్లో ఉంచడం గమనార్హం.
Samayam Telugu2 May 2020, 10:04 am
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఉన్న జిల్లాల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్లో ఉండగా.. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది. కాగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాను ఆరెంజ్ జోన్లో చేర్చి.. గత పది రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాని వరంగల్ అర్బన్ జిల్లాను రెడ్ జోన్లో ఉంచడం గమనార్హం. ఒకటి చొప్పున కరోనా మరణాలు సంభవించిన నారాయణపేట, మంచిర్యాల జిల్లాలు కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. గద్వాల ఈ జిల్లాలో 45 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారు. 14 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత వారం రోజులుగా జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కావడం లేదు. ఈ జిల్లాలో 1258 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు.
ఉమ్మడి పాలమూరులో ఇలా..
ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉండగా.. ఇప్పటి వరకూ ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాని వనపర్తి జిల్లా గ్రీన్ జోన్లో ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10 మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. గత 14 రోజులుగా ఈ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. నారాయణపేట జిల్లాలో రెండు నెలల బాబుకు పాజిటివ్ సోకగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ జిల్లాను కూడా ఆరెంజ్ జోన్లో ఉంచారు. కొత్త కేసులేవీ నమోదు కాకపోతే త్వరలోనే ఈ రెండు జిల్లాలు కూడా గ్రీన్ జోన్లోకి మారే అవకాశం ఉంది.
మంచిర్యాల ఆరెంజ్ జోన్లో..
కేవలం ఒకే కరోనా కేసు నమోదైన మంచిర్యాల జిల్లాను కూడా కేంద్రం ఆరెంజ్ జోన్లో ఉంచింది. చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 14న మరణించగా.. తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో గ్రీన్ జోన్లో ఉన్న మంచిర్యాల జిల్లాను ఆరెంజ్ జోన్లోకి మార్చారు. ఆ మహిళకు అసలు కోవిడ్ ఎలా సోకిందో కూడా అర్థం కావడం లేదు. కాగా చికిత్స కోసం ఆమెను హాస్పిటళ్లకు తీసుకెళ్లిన ఆమె కుమారులకు మాత్రం పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. జిల్లాలో ఒక్క కరోనా మరణం మినహా కొత్తగా పాజిటివ్ కేసులేవీ లేవు. కొత్త కేసులేవీ నమోదు కాకపోతే.. వచ్చే వారం నాటికి ఈ జిల్లా గ్రీన్ జోన్లో ఉండే అవకాశం ఉంది.
వరంగల్ అర్బన్ రెడ్ జోన్లో..
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్లో ఉండగా.. భూపాలపల్లి జిల్లా (3 కేసులు), జనగామ (3) ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాగా.. ములుగు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల క్రితమే వీరంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పది రోజుల క్రితం పూరిగుట్ట, ఎర్రబెల్లిలలో నమోదైన రెండు పాజిటివ్ కేసులు మినహా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఈ జిల్లాలో మొత్తం 27 మంది కరోనా పాజిటివ్ అని తేలగా.. 24 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అర్బన్ జిల్లాలో గత పది రోజులుగా కొత్తగా పాజిటివ్ కేసులేవీ లేకపోయినప్పటికీ రెడ్ జోన్లో ఉంచడం గమనార్హం. మరి కొద్ది రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకపోతే.. త్వరలోనే వరంగల్ అర్బన్ ఆరెంజ్ జోన్లోకి, భూపాలపల్లి, జనగామ జిల్లాలు గ్రీన్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది.
కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఇలా..
ఆరెంజ్ జోన్లో ఉన్న కామారెడ్డి జిల్లా (12 కేసులు)లో గత 19 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మెదక్లో 5, సంగారెడ్డిలో ఏడు చొప్పున కేసులు ఉన్నాయి. ఇండోనేసియన్ల కారణంగా కరీంనగర్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 18 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే ఉండగా.. ఆ పేషెంట్ కూడా 14 రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల మూడు కోవిడ్ కేసులు నమోదు కాగా.. వారందరూ చికిత్స తర్వాత కోలుకున్నారు. ఏప్రిల్ 14న గుంటూరు జిల్లా నుంచి వచ్చిన బాలుడికి కరోనా పాజిటివ్ అని రాగా.. అతడు కూడా డిశ్చార్జ్ అయ్యాడు. జిల్లాలో ప్రస్తుతం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేనప్పటికీ.. ముందు జాగ్రత్తగా కేంద్రం ఆరెంజ్ జోన్లో ఉంచింది. పెద్దపల్లి జిల్లా (2) గ్రీన్ జోన్లో ఉంది.
సూర్యాపేట రెడ్ జోన్లో.. కొద్ది రోజుల్లో చాలా జిల్లాలు గ్రీన్లోకి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట (88) రెడ్ జోన్లో ఉంది. గత రెండు వారాల్లో ఇక్కడ కేసులు భారీగా పెరిగాయి. నల్గొండ జిల్లా ఆరెంజ్ జోన్ పరిధిలో ఉండగా.. ఇక్కడ 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ జిల్లాను గ్రీన్ జోన్లో ఉంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం (8) ఆరెంజ్ జోన్లో ఉండగా.. కొత్త కేసులేవీ నమోదు కాని భద్రాద్రి (4) గ్రీన్ జోన్లోకి మారింది. ఖమ్మంలో ఏప్రిల్ 21న ఆఖరి కేసు నమోదైంది. మరి కొద్ది రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకపోతే మంచిర్యాల, కామారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, సిరిసిల్ల, నారాయణపేట తదితర జిల్లాలు గ్రీన్ జోన్లోకి మారే అవకాశం ఉంది. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెంజ్ జోన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.