యాప్నగరం

గాంధీ హాస్పిటల్: ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్ మృతి!

గాంధీ హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొరత లేదని, ఐసీయూలోనూ బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఓ పేషెంట్ ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయాడాని సమాచారం.

Samayam Telugu 16 Jul 2020, 8:20 am
ఆక్సిజన్ అందకపోవడంతో గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడొకరు బుధవారం తెల్లవారు జామున ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ సాయినగర్‌కు చెందిన గొల్ల శ్రీధర్‌కు కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నాలుగు రోజుల క్రితం ఉస్మానియా హాస్పిటల్‌‌కు వెళ్లాడు. కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ రావడంతో అతణ్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
Samayam Telugu gandhi hospital
Gandhi Hospital


గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీధర్.. తనకు శ్వాస ఆడటం లేదని.. ఆక్సిజన్ పెట్టాలని వైద్య సిబ్బందిని కోరాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. ఈ విషయమై కుటుంబ సభ్యులతో అతడు మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. శ్రీధర్ మరణించడంతో... ఆక్సిజన్ పెట్టకపోవడంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తమ హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొరత లేదని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. గాంధీలో కోవిడ్ మృతుల జాబితాలో శ్రీధర్ పేరుతో ఎవరూ లేరని ఆయన చెప్పడం గమనార్హం. ఇటీవలే నిజామాబాద్ హాస్పిటల్‌లో ముగ్గురు కరోనా బాధితులు, మరో పేషెంట్ ఆక్సిజన్ కొరత కారణంగా ఒకే రోజు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

‘‘గాంధీలో ఏం జరుగుతోంది. నాకు, నా భర్తకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పడం లేదు. ఆక్సిజన్ స్థాయిలు చెక్ చేస్తున్నారు. కానీ ఆక్సిజన్ లెవల్స్ బాగున్నాయా, పడిపోయాయా అనే విషయం ఎవరూ చెప్పడం లేదు’’ అంటూ ప్రమోదిని అనే మహిళ ట్వీట్ చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ను ఆమె ట్యాగ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.