యాప్నగరం

ఆ పని చేస్తే కేసీఆర్‌కు బాసటగా నిలుస్తాం.. తమ్మినేని ప్రకటన

Karimnagar: రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బీజేపీ ప్రయత్నాలను ఎండగట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

Samayam Telugu 16 Sep 2020, 2:55 pm
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిల కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఉపేక్షించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. కేసీఆర్ ఉద్యమిస్తే తాము బాసటగా నిలుస్తామని మద్దతు పలికారు. కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రం రూ.వేల కోట్లు నష్టపోయిందని వివరించారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని చెబుతుండడం దారుణమని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu తమ్మినేని వీరభద్రం (ఫైల్ ఫోటో)
Tammineni Veerabhadram


రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బీజేపీ ప్రయత్నాలను ఎండగట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అయితే, తాజాగా అసెంబ్లీ ఆమోదం పొందిన కొత్త రెవెన్యూ చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను సవరించాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నుంచి సామాన్యులను మినహాయించాలని డిమాండ్‌ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమ సమయంలో దిల్లీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర నేతలను నిందితులంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక బీజేపీ కుట్రలు ఉందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్షణమే వారిపై మోపిన ఆ అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.