యాప్నగరం

మనస్తాపంతో డాక్టర్ ఆత్మహత్య.. మరుసటి రోజు వెలుగులోకి, హయత్‌నగర్‌లో విషాదం

Hayathnagar: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తలిద్దరూ డాక్టర్లే కావడం గమనార్హం. హయత్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 13 Nov 2019, 2:05 pm
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం (నవంబర్ 13) ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అతడు ఆత్మహత్యకు పాల్పడిన మరుసటి రోజు ఆ విషయాన్ని గుర్తించడం మరో విషాదం.
Samayam Telugu suicide


పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన రమేశ్, హైదరబాద్‌కు చెందిన స్వప్నకు కొన్నేళ్ల కిందట వివాహాం జరిగింది. ఇద్దరూ డాక్టర్లే. వివాహం అనంతరం కొన్నేళ్లు వీరిద్దరూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనస్తీషియాలుగా పనిచేశారు. రెండేళ్ల కిందట అక్కడ ఉద్యోగాలు మానేసి హైదరబాద్ వచ్చేశారు. హయత్‌నగర్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

Also Read: కాచిగూడ ప్రమాదం.. పైలట్ పరిస్థితి విషమం

డాక్టర్ రమేశ్, స్వప్న దంపతుల మధ్య కొంత కాలంగా తీవ్ర స్థాయిలో కలహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఏడాది కిందట స్వప్న తన కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. నాటి నుంచి రమేశ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్న భోజనం నిమిత్తం రమేశ్ ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. అనంతరం భవనం పైకి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి వరకూ అతడు కిందకు రాలేదు. తల్లిదండ్రులు మాత్రం తాము విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతడు డ్యూటీకి వెళ్లి ఉంటాడని భావించి అలాగే ఉండిపోయారు.

Must Read: ‘సెక్రటేరియట్‌కు రాని కేసీఆర్‌ను ఎప్పుడో డిస్మిస్ చేయాల్సింది’

తమ కుమారుడు ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి బుధవారం ఉదయం భవనం పైకి వెళ్లి చూడగా రమేశ్ విగత జీవిగా పడి ఉన్నాడు. తమ కుమారుడిని ఆ స్థితిలో చూసి వారు బోరుమన్నారు. రమేశ్ మృతదేహం పక్కనే ఇంజెక్షన్ పడి ఉంది. వృత్తిలో భాగంగా రోగులకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్ అధిక మోతాదులో తీసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

గత కొన్ని నెలల నుంచి రమేశ్ భార్య స్వప్న కాపురానికి రావడంలేదని.. దీంతో తమ కుమారుడు తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎన్ని విధాలుగా నచ్చిజెప్పినా.. ఆమె వినలేదని వారు పోలీసులతో చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.