యాప్నగరం

ఈటల నన్ను ఓడగొట్టిండు, ప్రేమని కాదులే కానీ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఓడగొట్టించడంలో ఈటల రాజేందర్ పెద్ద పాత్ర పోషించిండు. ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్, పార్టనర్ రంజిత్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించిండు. కానీ ఆ ఒక్కదాని కోసమే ఈటలకి మద్దతుగా నిలవాలని అనుకున్నానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

Samayam Telugu 15 Oct 2021, 9:47 pm
అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ అయ్యి పార్టీ నుంచి బయటికొచ్చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల విజయం సాధించాలని తన వంతు సాయం కూడా అందిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాసి స్వయంగా తన టీంతో పంపిణీ చేయించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలను.. దొరల అహంకారాన్ని ఎండగడుతూ ఘాటు సందేశమే పంపించారు. అయితే ఈటల రాజేందర్‌పై ఆయనకెందుకంత ప్రేమ అనే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
konda


తాను ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా ఉన్నానని.. ఏ రాజకీయ పార్టీలోనూ లేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశానని చెప్పారు.. అందులో ఉంటే ఇప్పుడు ఈటలకి మద్దతు ఇవ్వడం కుదిరేది కాదని.. ఇండిపెండెంట్‌గా తెలంగాణకు ఏది మంచి జరుగుతుందంటే అది చేసే స్వేచ్ఛ ఇప్పుడు తనకుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి.. కేసీఆర్ అహంకారానికి జరుగుతున్న ఎన్నికగా ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికను అభివర్ణించారు. అలాగే ఈటలకు మద్దతుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈటలపై తనకు ప్రేమ కాదు కానీ తెలంగాణకు ఏది మంచిదో అదే చేయాలనేది తన అభిప్రాయమని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంకా చెప్పాలంటే ఈటల రాజేందర్ గత ఎన్నికల్లో తనను ఓడగొట్టడంతో పెద్ద పాత్ర పోషించాడని ఆయన చెప్పారు. ఈటల బిజినెస్ పార్ట్‌నర్, ఫ్యామిలీ ఫ్రెండ్, అతనికి సన్నిహితుడైన రంజిత్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించి పోటీకి నిలబెట్టారని ఆయన అన్నారు. తనను ఓడించేందుకు గట్టిగానే పనిచేశారని చెప్పారు.

అయితే అవన్నీ తనకు ముఖ్యం కాదని.. తండ్రీకొడుకుల పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకే తాను పనిచేస్తున్నానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలవాలని ఆయన ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల పార్టీ కాదని.. తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఆయన అన్నారు. మల్లా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వీళ్లంతా ఎవరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారు కాదా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ కోసం నిజంగా కొట్లాడింది ఈటల రాజేందర్ అని మాజీ ఎంపీ అన్నారు. తండ్రీకొడుకులకు వ్యతిరేకంగా గొంతెత్తినందుకే ఈటలను భూకబ్జా ఆరోపణల పేరుతో బయటికి పంపారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఫాం హౌస్ దారి అసైన్డ్ భూముల్లో నుంచి పోతుందని.. మల్లా రెడ్డి, పువ్వాడ, తలసానిపై కబ్జా ఆరోపణలు లేవా? అని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన సూటిగా అడిగారు. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమని అన్నందుకే ఈటలని బయటికి నెట్టేశారని ఆయన స్పష్టం చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.