యాప్నగరం

‘పసుపు రైతుకు దక్కేది రూ.60/కేజీ.. అక్కడ అమ్మేది రూ.1100.. మిగతా సొమ్ము ఎవరికి?’

నిజామాబాద్‌లో పసుపు రైతుకు దక్కేది కిలోకు రూ.60 అయితే.. అమెరికా చేరడానికి రూ.110 అవుతుందన్న ధర్మపురి అర్వింద్... కానీ కిలో పసుపును రూ.1100 చొప్పున న్యూయార్క్‌లో విక్రయిస్తున్నారన్నారు.

Samayam Telugu 12 Dec 2020, 3:50 pm
నూతన వ్యవసాయ చట్టాల విషయమై రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలోకి చేరుకున్న రైతులు.. రోడ్ల మీదే ఉంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే భారత్ బంద్ చేపట్టిన అన్నదాతలు.. డిసెంబర్ 14న ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్ వేను ముట్టడించనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ససేమీరా వద్దని రైతులు తెగేసి చెబుతుంటే.. కేంద్రం మాత్రం చట్టానికి సడలింపులు చేస్తామని.. చర్చలకు రావాలని అన్నదాతలకు సూచిస్తోంది.
Samayam Telugu Arvind_ED
Telangana BJP MP D Arvind. ANI


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రచారం చేస్తుండగా.. బీజేపీ నేతలు కొత్త చట్టాల ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. రైతుల ఆదాయం పెరుగుతుందని.. కొత్త చట్టంతో దళారీల బెడద తప్పుతుందని ప్రభుత్వం చెబుతోంది. నూతన చట్టం ఎందుకు అవసరమో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. వివరించే ప్రయత్నం చేశారు.

నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేస్తున్నారని అర్వింద్ ప్రశ్నించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినా.. వ్యవసాయ మార్కెట్లు ఉంటాయన్నారు. ప్రపంచంలోని పసుపు ఉత్పత్తిలో దాదాపు 90 శాతం నిజామాబాద్ పార్లమెంట్, పరిసర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతోందని అర్వింద్ తెలిపారు.

రైతుకు కిలో పసుపుకు రూ.60 దక్కుతోందన్న ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ నుంచి అమెరికా చేరడానికి పసుపు ధర గరిష్టంగా రూ.110 అవుతుంది. కానీ న్యూయార్క్‌లో కిలో పసుపును రూ.1100కు విక్రయిస్తున్నారు. ఈ డబ్బెంత ఎవరికి పోతుందో ఆందోళనకారులు సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కిలో పసుపు రూ.280 ఉంటే.. యూఏఈలో కిలో పసుపు రూ.500 ఉందన్నారు. రైతుకు దక్కే ధరకు ఎన్నో రెట్లు అదనంగా ధరను వినియోగదారులు ఎందుకు చెల్లించాల్సి వస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.