యాప్నగరం

ఫేస్ రికగ్నిషన్: దేశంలోనే తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో.. ఎలా పని చేస్తుందంటే

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. మేడ్చల్ జిల్లా కోంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో దీనికి సంబంధించిన మొబైల్ యాప్‌ను వాడుతున్నారు. ఆరు వార్డుల్లోని 10 పోలింగ్ బూత్‌లలో ఈ సాంకేతికతను పరీక్షిస్తున్నారు. ఇక్కడ ఓటర్లను దీనిద్వారా గుర్తించాక ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

Samayam Telugu 22 Jan 2020, 12:40 pm
Samayam Telugu first time in india telangana elections authorities using face recognition in municipal elections 2020
ఫేస్ రికగ్నిషన్: దేశంలోనే తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో.. ఎలా పని చేస్తుందంటే
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. మేడ్చల్ జిల్లా కోంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో దీనికి సంబంధించిన మొబైల్ యాప్‌ను వాడుతున్నారు. ఆరు వార్డుల్లోని 10 పోలింగ్ బూత్‌లలో ఈ సాంకేతికతను పరీక్షిస్తున్నారు. ఇక్కడ ఓటర్లను దీనిద్వారా గుర్తించాక ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

విధానం ఇలా..

అధికారులకు ప్రత్యేకంగా కేటాయించిన మొబైల్ ఫోన్‌తో పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటర్‌ను ఫొటో తీస్తారు. అయితే, అప్పటికే ఆ మొబైల్ ఫోన్‌కు ఎన్నికల కమిషన్ డేటా అనుసంధానమై ఉంటుంది. ఈ డేటా బేస్‌తో తాజా ఫోటోను ఈ సాంకేతికత పరిశీలించుకుంటుంది. ఆ రెండు ముఖాలు ఒకటేనా కాదా అనేది తేల్చుకుంటుంది. ఆ ఓటర్ సరైన వ్యక్తే అని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేసేందుకు అనుమతి వస్తుంది.

నకిలీ ఓట్ల గుర్తింపు పట్టేస్తుంది.

ఓటరును తానేనంటూ పౌరులు సమర్పించే ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఓటరును ఈ సాంకేతికత ద్వారా గుర్తించవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటరుకి సంబంధించిన పూర్తి వివరాలను సునాయాసంగా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఓటరు ముఖాన్ని చూసి అతడు ఓటరేనా? కాదా? అనేది 10 సెకన్లలో తేల్చేయవచ్చని చెప్పారు. అయితే, కవల పిల్లలు, రక్త సంబంధం ఉన్న వారి ముఖాలు గుర్తించే విషయంలో మాత్రం మ్యాన్యువల్‌గా ధ్రువ పత్రాలు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

తర్వాత ఫోటోలు తొలగించేలా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ), బిగ్‌ డేటా, మెషీన్‌ లర్నింగ్‌ల తదితర అంశాల ఆధారంగా ఈ సాంకేతికత పనిచేస్తుందని ఈసీ తొలుత వెల్లడించింది. అయితే, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల ఫొటోలను తీసిన అనంతరం వాటిని అందులో భద్రపర్చబోమని, ఎన్నికలు పూర్తవగానే వాటిని తొలగిస్తామని ఎస్‌ఈసీ అధికారులు స్పష్టం చేశారు.

ఇంకా ఎక్కడెక్కడ..

ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వివిధ రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నేరస్థులను గుర్తించి, వారిని పట్టుకోవడంలోనూ వాడుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పరారీలో ఉన్న నేరస్థులను గుర్తించడం పోలీసులు సాధ్యమవుతోంది. అయితే, ఈ విషయంలో ముఖ గుర్తింపు సాంకేతికత ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఫోన్ లాక్ తీసేందుకు ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ఉంటున్న సంగతి తెలిసిందే.

Video-మున్సిపల్ ఎన్నికలు: ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.