యాప్నగరం

భారీ వర్షాలతో మళ్లీ పెరుగుతున్న గోదావరి.. భయం గుప్పిట్లో భద్రాద్రి

భద్రాచలం వద్ద కొద్దిగా శాంతించిన గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. గురువారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

Samayam Telugu 20 Aug 2020, 10:36 am
భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ఇటీవలే 61 అడుగులు దాటి సమీప గ్రామాలను, పంట పొలాలను ముంచెత్తిన గోదావరి మరోసారి భయపెడుతోంది. గత వారం వేగంగా పెరిగిన గోదావరి నీటి మట్టం గత రెండు రోజుల్లో సుమారు 19 అడుగులు తగ్గింది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. కాగా గురువారం ఉదయం నుంచి గోదావరి మళ్లీ పెరుగుతోంది.
Samayam Telugu bhadrachalam godavari


ఇవాళ ఉదయం 5 గంటలకు 42.6 అడుగుల వద్ద ఉన్న గోదావరి.. రెండు గంటలు గడిచే సరికి 43.1 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉదయం పది గంటలకు గోదావరి నీటి మట్టం 44.8 అడుగులకు చేరింది. ఇవాళ రాత్రికి గోదావరి వరద 48 అడుగులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నదీ ప్రవాహం 53 అడుగులు దాటితే మూడో, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గోదావరి వరద 60 అడుగులు దాటింది. భద్రాచలం వద్ద ఓ దశలో 17.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది. దీంతో అధికార యంత్రాంగం ఆందోళన చెందింది. కానీ వరద తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో గోదావరి ప్రవాహం మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.