యాప్నగరం

రాజకీయాలకు రాజ్ భవన్ అడ్డా కాదు.. గవర్నర్ తమిళిసై తీవ్ర ఆగ్రహం

Raj Bhavan: శుక్రవారం గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 3 Oct 2020, 7:42 am
తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరుపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని ఆరోపించారు. రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేయడంపై గవర్నర్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ డ్రామాలు చేయడానికి రాజ్‌భవన్‌ రాజకీయ అడ్డా కాదని ఘాటుగా స్పందించారు. రాజ్‌భవన్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని అన్నారు. కరోనా కారణంగానే తానెవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని స్పష్టంచేశారు. నాలుగు నెలలుగా రాజ్‌భవన్‌ ఇదే విధానాన్ని అవలంబిస్తోందని గుర్తు చేశారు. తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని చెప్పారు. ప్రజలకు రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన రాజకీయ పార్టీలు భౌతికదూరం పాటించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
Samayam Telugu గాంధీకి నివాళులు అర్పిస్తున్న గవర్నర్ తమిళిసై
Governor tamilisai fires on telangana congress leader


శుక్రవారం గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రజలకు 24 గంటలపాటు ఇకపై రాజ్‌భవన్‌ అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుందని తమిళిసై చెప్పారు. తన పరిధి మేరకు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఈ-మెయిల్‌ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ విధానాలు ఇతరరాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో మెరుగ్గా ఉన్నాయని తమిళిసై అన్నారు. రికవరీ రేటులో రాష్ట్రం ఉన్నతస్థానంలో ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో వైరస్‌ ప్రభావం పెరిగితే, మన రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిందని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు బాగా మెరుగయ్యాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ.. అత్యధిక వరి దిగుబడిని సాధించి రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా నిలవడం గర్వంగా ఉన్నదని తెలిపారు. త్వరలోనే తాను పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడతానని, తాను తమిళనాడు బిడ్డనని, తెలంగాణకు సోదరినని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.